Share News

IAS officer: పూజా కేడ్కర్ ‘డిమాండ్లు’.. వాట్సప్‌ చాట్ వైరల్

ABN , Publish Date - Jul 11 , 2024 | 02:19 PM

అధికార దుర్వినియోగానికి పాల్పడిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా కేడ్కర్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. అయితే పుణె జిల్లా కలెక్టర్‌తో ఆమె తన డిమాండ్లను వాట్సప్‌లో స్పష్టం చేసింది. పుణె జిల్లా కలెక్టర్‌తో ఆమె చేసిన చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

 IAS officer: పూజా కేడ్కర్ ‘డిమాండ్లు’.. వాట్సప్‌ చాట్ వైరల్
Probationary IAS officer Puja Khedkar

ముంబై, జులై 11: అధికార దుర్వినియోగానికి పాల్పడిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా కేడ్కర్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. అయితే పుణె జిల్లా కలెక్టర్‌తో ఆమె తన డిమాండ్లను వాట్సప్‌లో స్పష్టం చేసింది. పుణె జిల్లా కలెక్టర్‌తో ఆమె చేసిన చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆమె పుణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే ముందు తన డిమాండ్లను జిల్లా కలెక్టర్‌కు వాట్సప్ ద్వారా తెలియజేసింది. అంతేకాదు.. విధుల్లో చేరే ముందు ఆమె తన తండ్రి దిలీప్ కేడ్కర్‌తో కలిసి.. కలెక్టరేట్‌కు వచ్చింది. ట్రైనీ కలెక్టర్‌గా ఆమెకు చాంబర్ కేటాయిస్తే.. అందుకు అభ్యంతరం తెలిపారు. ఆ క్రమంలో వీఐపీ హాల్‌ను తనకు కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.


అదీకాక.. పుణెలో ట్రైనీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెకు ప్రభుత్వం ప్రైవేట్ కారు కేటాయించింది. ఆ కారుకు బ్లూ, రెడ్ బల్బ్ అమర్చుకుంది. అలాగే వీఐపీ నేమ్ బోర్డుతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వం బోర్డును సైతం ఆ కారుకు ఏర్పాటు చేసింది. అక్కడితో ఆగకుండా.. తనకు ప్రత్యేక చాంబర్‌, కొంతమంది సిబ్బందితోపాటు ఓ కానిస్టేబుల్‌ను కేటాయించాలంటూ జిల్లా కలెక్టర్‌ను కోరింది. ఆ క్రమంలో తన వాట్సప్ ద్వారా చాట్ చేసింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు.. వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పూజా కేడ్కర్‌ పుణె అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తే.. పరిపాలన సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశముందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జిల్లా కలెక్టర్ లేఖ రాసినట్లు సమాచారం. దీంతో వెంటనే ప్రభుత్వం ఆమెపై చర్యలు చేపట్టింది. ఆమెను వాషిమ్‌కు బదిలీ చేసింది. అయితే సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా వాషిమ్‌లో విధులు నిర్వహించాలని ఆమెకు ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఇంకోవైపు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు పూజా కేడ్కర్.. ఓబీసీ రిజర్వేషన్‌తోపాటు దృష్టి దోషం కేటగిరిలో పరీక్షకు హాజరైంది. అంతేకాకుండా తనకు మానసిక సమస్యలున్నాయని సర్టిఫికేట్‌ను సైతం సమర్పించింది. దీంతో ఈ ఎగ్జామ్స్‌లో 841 ర్యాంక్ వచ్చిన ఆమెకు యూపీఎస్సీ.. ఐఏఎస్‌ కేటాయించింది. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వాటికి సైతం పూజా కేడ్కర్ డుమ్మా కొట్టింది. చివరకు ఎమ్మారై స్కాన్‌ను ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకొని.. ఆ సర్టిఫికేట్‌ను యూపీఎస్సీకి సమర్పించింది. దీంతో ఆమె ఐఏఎస్ హోదా దక్కించుకుంది. ఇక పూజా కేడ్కర్ తండ్రి దిలీప్ కేడ్కర్ సైతం సివిల్ సర్వెంట్ మాజీ అధికారి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వంచిత్ బహుజన్ అగాదీ టికెట్‌పై పోటీ చేశారు. ఈ సందర్బంగా ఆయన తన ఆస్తి రూ. 40 కోట్లు ఉందని నామినేషన్‌ పత్రాల్లో స్పష్టం చేశారు. అలాంటి వేళ.. పూజా కేడ్కర్ వ్యవహారంపై సర్వత్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 11 , 2024 | 02:49 PM