Share News

Congress: ఖాళీ అవుతున్న ‘కారు’ పార్టీ.. కాంగ్రెస్‌లో చేరిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే

ABN , Publish Date - Jun 28 , 2024 | 03:56 PM

తెలంగాణలో రోజురోజుకూ ‘కారు’ పార్టీ ఖాళీ అవుతోంది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే గులాబీ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారో తెలియని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల ముందు మొదలైన చేరికలు.. పార్లమెంట్ ఎన్నికల అనంతరం మరింత జోరందుకున్నాయి...

Congress: ఖాళీ అవుతున్న ‘కారు’ పార్టీ.. కాంగ్రెస్‌లో చేరిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే

తెలంగాణలో రోజురోజుకూ ‘కారు’ పార్టీ ఖాళీ అవుతోంది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే గులాబీ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారో తెలియని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల ముందు మొదలైన చేరికలు.. పార్లమెంట్ ఎన్నికల అనంతరం మరింత జోరందుకున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్‌లోకి వచ్చేయగా.. తాజాగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు.


Kale-Yadayya-dd.jpg

ఖాళీ అవుతోందే..!

అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయ్యి.. పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకుందామనుకున్న బీఆర్ఎస్‌కు అడుగడుగునా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేకపోవడం.. లోక్‌సభ ఎన్నికల ముందు సిట్టింగ్ ఎంపీలే జంప్ అవ్వడం, టికెట్ దక్కించుకున్న తర్వాత ఊహించని రీతిలో ఝలక్ ఇచ్చేసి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేయడం గమనార్హం. ఈ షాక్‌ల నుంచి తేరుకోకముందే వరుసగా నలుగురు ఎమ్మెల్యేలు ఈ మధ్య కాలంలోనే బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేయడంతో కారు పార్టీ కంగుతిన్నది. ఇలా ఒక్కొక్కరుగా ‘కారు’ దిగుతుండగా.. తాజాగా చేవెళ్ల నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన కాలె యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, టి. కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీల సమక్షంలో ఈ చేరిక జరిగింది. కాంగ్రెస్ కండువా కప్పిన రేవంత్.. యాదయ్యను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు.. త్వరలో మరికొన్ని చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారలేదే!


Kale-Yadayya-Congress.jpg

ఎవరీ యాదయ్య..?

కాలె యాదయ్య.. కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎంపీపీ, జడ్పీటీసీగా పనిచేసిన ఆయన.. తొలిసారి 2009 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన చేవెళ్ల నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. టీడీపీ తరఫున పోటీచేసిన కోరాని సాయన్న రత్నం గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో పార్టీ మారిన ఇదే ప్రత్యర్థిపైనే.. యాదయ్య పోటీచేసి 781 ఓట్ల మెజార్టీతో తొలిసారి గెలుపొందారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కొద్దిరోజుల్లోనే గులాబీ కండువా కప్పేసుకున్నారు. ఇక 2018 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరఫున పోటీచేసి 33,552 మెజార్టీతో గెలిచారు. 2023 ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్థి పామేని భీమ్ భరత్ కాంగ్రెస్‌ నుంచి పోటీచేయగా.. సాయన్న బీజేపీ నుంచి పోటీచేశారు. అయినా సరే ఈ ఇద్దర్నీ ఓడించి అతి తక్కువ 268 ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. దీంతో వరుసగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు యాదయ్య. ఈయన రాకతో కాంగ్రెస్ శ్రేణులు, నేతలు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ చేరికపై ఈయన ప్రత్యర్థి భీమ్ భరత్ మాత్రం ఇంతవరకూ ఎక్కడా స్పందించలేదు.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..


Updated Date - Jun 28 , 2024 | 04:37 PM