Share News

CM Revanth Reddy: రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ

ABN , Publish Date - Aug 02 , 2024 | 12:29 PM

పదోన్నతి పొందిన వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభినందనలు తెలిపారు.

CM Revanth Reddy: రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ

హైదరాబాద్: పదోన్నతి పొందిన వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభినందనలు తెలిపారు. 10.468 పండిత, పీఈటీ పోస్టుల అప్ గ్రేడేషన్‌కు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు ఇచ్చిందన్నారు. మీరు నిర్వహిస్తున్న సభలో సింహభాగం వారే కావడం గమనించాల్సిందిగా సూచిస్తున్నామన్నారు. మా ప్రభుత్వం 10.000 ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేస్తే ఇప్పటి వరకూ పాఠశాలలకు కేటాయించలేదన్నారు. వెంటనే కేటాయించి ఎస్‌జీటీలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ రోజు వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ముఖాముఖిలో మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.


మీరు ఇచ్చిన మాట ప్రకారం మరింత మెరుగైన పీఆర్ఈసీ ఎప్పుడు అమలుచేస్తారో విస్పష్టంగా ప్రకటింలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మీరు మీ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కనీసం పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను ఎప్పుడు అనుమతిస్తారో ఆ సంగతన్నా సభలో ప్రకటిస్తే అందరూ సంతోషిస్తారన్నారు. న్యూ పెన్షన్ స్కీం స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీం తీసుకువస్తామన్నారు. ఎప్పటి నుంచి అమలుచేస్తారో సభలో ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. పాఠశాలలకు స్కావెంజర్స్‌ను అనుమతిస్తామన్నారు. అది ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదన్నారు. ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామన్నారు. ఇప్పటికీ దానిపై నిర్ణయం ప్రకటించలేదని హరీష్ రావు అన్నారు.


బదిలీ అయినా ఇప్పటి వరకూ రాష్ట్రంలో నూతన పాఠశాలలో చేరని ఎస్‌జీటీ ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని హరీష్ రావు అన్నారు. బదిలీల వలన ఖాళీలు ఏర్పడిన పాఠశాలలో అవసరమైన మేరకు విద్యావాలంటీర్లను వెనువెంటనే నియమించాలన్నారు. మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని హరీష్ రావు అన్నారు. మధ్యాహ్న భోజన పథకం వర్కర్లకు మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే వేతనాలు పెంచాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Updated Date - Aug 02 , 2024 | 12:29 PM