Share News

Hyderabad: 70 వసంతాలు..70 అడుగులు

ABN , Publish Date - Aug 25 , 2024 | 11:43 AM

ఖైరతాబాద్‌(Khairatabad) గణపతి అంటే ఆ క్రేజే వేరు. నగర దారులన్నీ అటు వైపే అన్నట్లు 11 రోజులపాటు అక్కడి పరిసరాలు జనసంద్రంగా మారుతుంటాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల నుంచి అనేకమంది లంబోధరుడి దర్శనం కోసం తరలివస్తుంటారు.

Hyderabad: 70 వసంతాలు..70 అడుగులు

- వేగంగా ఖైరతాబాద్‌ మహా గణపతి పనులు

- 90 శాతం పూర్తి, తుది మెరుగుల్లో విగ్రహాలు

- రేయింబవళ్లు శ్రమిస్తున్న 150 మంది నిపుణులు

- ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం

హైదరాబాద్: ఖైరతాబాద్‌(Khairatabad) గణపతి అంటే ఆ క్రేజే వేరు. నగర దారులన్నీ అటు వైపే అన్నట్లు 11 రోజులపాటు అక్కడి పరిసరాలు జనసంద్రంగా మారుతుంటాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల నుంచి అనేకమంది లంబోధరుడి దర్శనం కోసం తరలివస్తుంటారు. చివరిరోజు నిమజ్జనం నాడూ భక్తజనం శోభాయాత్రలో భారీగా పాల్గొంటుంది. 70 సంవత్సరాల ఖైరతాబాద్‌(Khairatabad) గణపతి ఉత్సవాల సందర్భంగా తొలిసారి 70 అడుగుల ఎత్తుతో పూర్తిగా మట్టి, సహజ రంగులతో పర్యావరణహితంగా గణపయ్యను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మట్టి పనులు పూర్తికాగా.. రంగులద్దే పనులు రెండురోజుల క్రితం ప్రారంభమయ్యాయి.

ఇదికూడా చదవండి: Minister Ponguleti : రెవెన్యూ సమస్యలపై మంత్రి పొంగులేటి ప్రత్యేక దృష్టి


రాహు, కేతువులతోపాటు అయోధ్య బాలరాముడు విగ్రహం

ఖైరతాబాద్‌ గణపతిని ప్రతియేటా అప్పటి తిధి, నక్షత్రాలకనుగుణంగా కాలమానం ప్రకారం ఏ విధంగా పూజిస్తే సర్వజనులకు హితం కలుగుతుందనే విషయమై పండితులతో చర్చించి నిర్ణయిస్తారు. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా నామకరణం చేసి అదే రూపంలో తయారు చేస్తున్నారు. ఏడు ముఖాల్లో ఓవైపు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు...మరోవైపు అమ్మవార్లు సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి, మధ్యన గణపతి ఉన్నారు. 14 చేతుల్లో గణపతి కుడివైపు చక్రం, అంకుశం, గ్రంధం, శూలం, కమలం, శంఖు, ఆశీర్వాదాలు ఉండగా ఎడమ చేతిలో రుద్రాక్ష, పాశం, పుస్తకం, వీణ, కమలం, గద, లడ్డూ ఉంటుంది. ఈసారి అయోధ్య బాలరాముడిని గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తుతో చూడముచ్చటగా తయారు చేశారు.


రాత్రింబవళ్లు నిర్మాణ పనులు

విగ్రహ ఏర్పాటులో భాగంగా షెడ్డుతో మొదలయ్యే పనులను ఆదిలాబాద్‌కు చెందిన నర్సయ్యతోపాటు 25 మంది నిపుణులు శ్రమించి ఎంతటి బలమైన గాలులు వీచినా కదలకుండా 70 అడుగులకు పైగా ఎత్తుతో ధృఢంగా తయారు చేశారు. వెల్డింగ్‌ పనులను మచిలీపట్నం చెందిన నాగబాబుతోపాటు 23 మంది నిపుణులు రాత్రింబవళ్లు పనిచేయగా చెన్నైకు చెందిన మూర్తి, మరో 25 మంది గణపతి ఔట్‌లైన్‌ పనులను, ఒడిశాకు చెందిన జోగారావుతోపాటు 20 మంది కళాకారులు రాహు, కేతువు, బాలరాముడు, శివ కల్యాణం, శ్రీనివాస కల్యాణం ఘట్టాలతోపాటు వినాయకుడి ఫినిషింగ్‌ పనులు చేపట్టారు.

city1.jpg


మరో 55 మంది నిపుణులు గణపతిని సహజరంగులతో ముస్తాబు చేయనున్నారు. భారీ గణపతి తయారీ కోసం దాదాపు కోటి రూపాయలకు పైగా ఖర్చవుతున్నట్లు ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ కన్వీనర్‌ సందీ్‌పరాజ్‌ తెలిపారు.

ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ (పీవోపీ) ఏ మాత్రం వాడకుండా, దానికంటే ధృఢంగా విగ్రహం ఉండేలా పనులు చేశామని, కేవలం సహజ రంగులనే వినియోగిస్తున్నట్లు విగ్రహ ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్‌ పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 25 , 2024 | 11:43 AM