Share News

Hyderabad: గోషామహల్‌లో ఉస్మా‘నయా’ ఆస్పత్రి..

ABN , Publish Date - Aug 03 , 2024 | 10:06 AM

ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital) కొత్త భవన నిర్మాణానికి ఎట్టకేలకు ముందడుగు పడుతోంది. గోషామహల్‌ పోలీసు మైదానంలో భవనం నిర్మించనున్నట్లు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) చేసిన ప్రకటన ఊరట కలిగించింది.

Hyderabad: గోషామహల్‌లో ఉస్మా‘నయా’ ఆస్పత్రి..

- పోలీసు గ్రౌండ్‌లో నిర్మాణానికి సన్నాహాలు

- మరింత విస్తరించనున్న వైద్యసేవలు

- సకల సదుపాయాలతో కొత్త భవనం

- రేవంత్‌ ప్రకటనతో రోగులకు ఊరట

హైదరాబాద్‌ సిటీ: ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital) కొత్త భవన నిర్మాణానికి ఎట్టకేలకు ముందడుగు పడుతోంది. గోషామహల్‌ పోలీసు మైదానంలో భవనం నిర్మించనున్నట్లు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) చేసిన ప్రకటన ఊరట కలిగించింది. ఉస్మానియాకు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. ఎన్నో అరుదైన ఆపరేషన్లు ఇక్కడ జరిగాయి. కొత్త ఔషధాలను కనుగొన్న చర్రిత ఉస్మానియాకు ఉంది. అయితే పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా పడకలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నా ముందుకు సాగడం లేదు.

ఇదికూడా చదవండి: GHMC: నలుగురు జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల అరెస్టు.. కారణం ఏంటంటే..


దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇక్కడ కొత్త భవన నిర్మాణానికి ప్లాన్‌ చేశారు. శంకుస్థాపనకు సిద్ధం అవుతున్న సమయంలో కొన్ని అవాంతరాలతో పనులు ఆగిపోయాయి. ఇక్కడ కొత్త నిర్మాణాలు హెరిటేజ్‌ భవనాల కంటే ఎత్తులో ఉండరాదని, ఆ నిర్మాణాల నీడ చారిత్రాత్మక భవనాలపై పడకూడదనే నిబంధనలు అడ్డుగా మారాయి. దీంతో అప్పట్లో ఏడు ఎకరాల్లో కొత్త భవనాల నిర్మాణాలకు దాదాపు 2 కోట్ల రూపాయల నిధులు మంజూరైనప్పటికీ పనులు మొదలు కాలేదు. ఆ తర్వాత హెరిటేజ్‌ నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా అయిదు ఎకరాల స్థలంలో రెండు కొత్త భవనాలను నిర్మించడానికి గత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ అప్పుడు కూడా పనులు మొదలుకాలేదు. కేసీఆర్‌ ఉస్మానియాను సందర్శించి త్వరలో భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు. ఆచరణలో కార్యరూపం దాల్చలేదు. మరోవైపు ఇక్కడ పాతభవనం శిథిలం కావడంతో దానికి పూర్తిగా తాళం వేశారు.


కాంగ్రెస్‌ హయాంలో సరికొత్తగా..

గోషామహల్‌ పోలీసు మైదానం(Goshamahal Police Ground)లో కొత్త ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించేందుకు ప్రభుత్వం 30 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఏడెనిమిది అంతస్తుల వరకు నిర్మించాలని భావిస్తోంది. కొత్త ఆస్పత్రిలో 750 నుంచి 1000 పడకల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓపీ విభాగంతో పాటు ఇన్‌పేషెంట్లకు అవసరమైన వార్డులు, పడకలు, ఆధునిక పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆపరేషన్‌ థియేటర్లు నిర్మించనున్నారు. సీసీటీవీల నిఘా, అగ్నిప్రమాదాల నుంచి రక్షణకు అనుగుణంగా ఈ భవనాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.


ఎక్కడికక్కడే సేవలు..

ప్రస్తుత ఉస్మానియా ఆస్పత్రి పాతబస్తీ సరిహద్దుగా ఉంటే.. కొత్త ఆస్పత్రి సిటీ సెంటర్‌(Hospital City Center)గా ఉండబోతుంది. వైద్యసేవలు ఎక్కడికక్కడే అందించే యోచనలో వైద్యాధికారులు ఉన్నారు. ఈ కొత్త ఆస్పత్రి కూడా ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి అనుబంధంగానే పనిచేయనుంది. మెడికల్‌ కాలేజీ(Medical College)కి అయిదు కిలోమీటర్ల పరిధిలో ఆస్పత్రి ఉండాలి. గోషామహల్‌ మూడు కిలోమీటర్ల పరిధి మేరకే ఉండడంతో నిబంధనలకు అనగుణంగా ఉండడమే కాకుండా పర్యవేక్షణ సులువుగా ఉంటుంది. మెట్రోస్టేషన్‌, ఎంజీబీఎస్‌, నాంపల్లి రైల్వేస్టేషన్లకు దగ్గరగా ఉండడంతో రాకపోకలు కూడా సులువుకానున్నాయి.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Updated Date - Aug 03 , 2024 | 10:06 AM