Share News

Khammam: ఖమ్మంలో ఘోర ప్రమాదం.. సాగర్ కాలువలో పడి..

ABN , Publish Date - Oct 01 , 2024 | 07:24 PM

ఖమ్మం సాగర్ కెనాల్‌లో పడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బాపణకుంటకు చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరంతా గంజాయి కేసులో బెయిల్ కోసం వెళ్లగా ప్రమాదవశాత్తూ కాలువలో పడి గల్లంతయ్యారు.

Khammam: ఖమ్మంలో ఘోర ప్రమాదం.. సాగర్ కాలువలో పడి..

ఖమ్మం: గంజాయి కేసులో బెయిల్ కోసం వెళ్లిన ముగ్గురు యువకులు సాగర్ కాలువలో గల్లంతయిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బాపణకుంటకు చెందిన నలుగురు వ్యక్తులు ఖమ్మం సబ్ జైలులో ఉన్న చల్లా రాము బెయిల్ పని మీద నగరానికి వచ్చారు. అక్కడ పని పూర్తయిన వెంటనే తిరుగు ప్రయాణంలో జైలు పక్కనే ఉన్న సాగర్ కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే ఒకరికి ఈత రాకపోవడంతో అతను ఆటోలో ఒడ్డుపైనే ఉన్నాడు.


చల్లా రమేశ్, ప్రసాద్, బండారి భరత్ అనే వ్యక్తులు నీటిలోకి దిగారు. అయితే చల్లా రమేశ్ కాస్త లోతైనా ప్రాంతానికి వెళ్లడంతో మునిగిపోబోయాడు. దీంతో మిగిలిన ఇద్దరూ అతణ్ని రక్షించేందుకు ప్రయత్నించారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో ముగ్గురూ కొట్టుకుపోయారు. అయితే ఆటోలో ఉన్న వ్యక్తి ప్రమాదం గురించి వెంటనే పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అయితే గాలింపు చర్యల్లో భాగంగా బండారి భరత్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మిగతా ఇద్దరి కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే రాత్రి వేళ కావడంతో పనులు ముందుకు సాగడం లేదు.


అయితే ప్రమాద నేపథ్యంలో బాపణకుంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ గ్రామానికి చెందిన ముగ్గురూ ఒకేసారి గల్లంతు కావడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ కోసం వెళ్లి ఇలా ప్రాణాలు పోయే స్థితి వస్తుందని అనుకోలేదంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అప్పటివరకూ తమ కళ్లెదుటే ఉన్న కుటుంబసభ్యులు ఇక లేరన్న వార్త విని బాధిత కుటుంబాలు శోకసద్రంలో మునిగిపోతున్నారు. అయితే సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు తమ వారి కోసం ఖమ్మం నగరానికి చేరుకున్నారు.


ఇవి కూడా చదవండి:

Hyderabad: హైదరాబాద్ పోలీసుల నయా రూల్స్.. మతపరమైన కార్యక్రమాల్లో డీజేలు పెడితే..

Hyderabad: అశ్లీల వీడియోలు చూస్తే ఇకపై జైలుకే.. అలాంటి వారిపై కన్నేసిన నిఘా సంస్థలు..

Rain Alert: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 01 , 2024 | 07:25 PM