Share News

Bhatti: డైట్‌, కాస్మెటిక్‌ చార్జీలు 40% పెంపు?

ABN , Publish Date - Oct 22 , 2024 | 04:06 AM

రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల నెలవారీ డైట్‌, కాస్మెటిక్‌ చార్జీలు పెరగనున్నాయి. ఇవి దాదాపు 40 శాతం మేర పెరిగే అవకాశాలున్నాయి.

Bhatti: డైట్‌, కాస్మెటిక్‌ చార్జీలు 40% పెంపు?

  • ఉన్నతాధికారుల కమిటీ సిఫారసు

  • డిప్యూటీ సీఎం భట్టికి నివేదిక అందజేత

  • 26న క్యాబినెట్‌ భేటీలో నిర్ణయం?

  • 16 ఏళ్ల తర్వాత కాస్మెటిక్‌ చార్జీల పెంపు

  • ఏడేళ్ల తర్వాత పెరగనున్న డైట్‌ చార్జీలు

  • రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, హాస్టల్‌ విద్యార్థులకు వర్తింపు

  • 7,65,705 మంది విద్యార్థులకు లబ్ధి

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల నెలవారీ డైట్‌, కాస్మెటిక్‌ చార్జీలు పెరగనున్నాయి. ఇవి దాదాపు 40 శాతం మేర పెరిగే అవకాశాలున్నాయి. దీనివల్ల 7.65 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. చార్జీల పెంపు కోసం ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికారుల కమిటీ సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు నివేదికను సమర్పించింది. ప్రస్తుతమున్న చార్జీలకు అదనంగా 40 శాతం మేర పెంచాలంటూ కమిటీ సిఫారసు చేసింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. 26న జరిగే క్యాబినెట్‌ సమావేశంలో కమిటీ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. నిజానికి సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యార్థుల కాస్మెటిక్‌ చార్జీలు 16 ఏళ్ల నుంచి , డైట్‌ చార్జీలు ఏడేళ్ల నుంచి పెరగడం లేదు. అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వీటి గురించి పెద్దగా పట్టించుకోలేదు.


కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... ఈ చార్జీలను పెంచాలంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం తదితరులు సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టికి విజ్తప్తి చేశారు. సీఎం సూచన మేరకు డిప్యూటీ సీఎం భట్టి ఈ నెల 17న బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం అధ్యక్షతన ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. డైట్‌, కాస్మెటిక్‌ చార్జీల పెంపు కోసం ఈ కమిటీ పలు అంశాలను పరిశీలించింది. గత ప్రభుత్వం కాస్మెటిక్‌ చార్జీలపై నియమించిన కమిటీ 2023, మార్చి 1న ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించింది. 2022, ఫిబ్రవరి 22న మహిళా శిశు సంక్షేమ శాఖ.... దివ్యాంగుల వసతి గృహాల్లోని విద్యార్థులకు పెంచిన డైట్‌ చార్జీలను పరిగణనలోకి తీసుకున్నది. అన్నీ పరిశీలించి 40 శాతం మేర నెలవారీ కాస్మెటిక్‌ , డైట్‌ చార్జీలను పెంచాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ చార్జీలను పెంచడం వల్ల రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లోని 7,65,705 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కమిటీ వివరించింది.


కమిటీ సిఫారసు చేసిన డైట్‌ చార్జీలు(రూ.లలో)

తరగతి ప్రస్తుతం పెరిగితే

3నుంచి - 7వ తరగతి వరకు 950 1330

8నుంచి 10వ తరగతి వరకు 1100 1540

ఇంటర్‌ నుంచి పీజీ వరకు 1500 2100

కాస్మెటిక్‌ చార్జీలు (విద్యార్థినుల కోసం)

3నుంచి 7వ తరగతి వరకు 55 175

8నుంచి 10వ తరగతి వరకు 75 275

కాస్మెటిక్‌ చార్జీలు (విద్యార్థుల కోసం)

3నుంచి 7వ తరగతి వరకు 62 150

8నుంచి 10వ తరగతి వరకు 62 200

Updated Date - Oct 22 , 2024 | 04:06 AM