Nagarjunasagar: వారానికి రెండు రోజులు సాగర్-శ్రీశైలం లాంచీలు!
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:25 AM
ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ నుంచి ఆధ్యాత్మిక శైవక్షేత్రం శ్రీశైలానికి ఇకపై వారానికి రెండు రోజులు లాంచీలు నడపనున్నట్లు పర్యాటక శాఖ వాటర్ ఫ్లీట్ జీఎం ఇబ్రహీం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

నాగార్జునసాగర్, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ నుంచి ఆధ్యాత్మిక శైవక్షేత్రం శ్రీశైలానికి ఇకపై వారానికి రెండు రోజులు లాంచీలు నడపనున్నట్లు పర్యాటక శాఖ వాటర్ ఫ్లీట్ జీఎం ఇబ్రహీం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది నవంబరు 2న సాగర్-శ్రీశైలం లాంచీ ట్రిప్పులను ప్రారంభించామని, వారానికి ఒక ట్రిప్పు చొప్పున ఇప్పటి వరకు 6 ట్రిప్పులు నడిపి 800మందిని శ్రీశైలం తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఇక నుంచి మంగళ, శనివారాల్లో సాగర్-శ్రీశైలం లాంచీలు నడుపుతామని తెలిపారు. ఒకవైపు టికెట్ ధర పెద్దలకు రూ.2,000, పిల్లలకు(12 ఏళ్లలోపు) రూ.1,600, రెండువైపులా టికెట్ ధర పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,400గా నిర్ణయించినట్లు చెప్పారు.