వేసవిలో బ్రేక్ దర్శనాల కుదింపు!
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:38 AM
వేసవి సెలవుల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించేలా బ్రేక్ దర్శనాలను కుదించేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. ఏపీతో పాటు ఇటీవల తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపైనా టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే.

సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించేలా టీటీడీ కసరత్తు
తిరుమల, మార్చి27(ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించేలా బ్రేక్ దర్శనాలను కుదించేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. ఏపీతో పాటు ఇటీవల తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపైనా టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శుక్ర, శనివారాల మినహా మిగిలిన అన్ని రోజులకు సిఫార్సులపై వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు జారీ చేస్తున్నారు. దీంతో పాటు సీఎంవోలు, కేంద్రమంత్రులు, టీటీడీ బోర్డు, శ్రీవాణిట్రస్టు, న్యాయశాఖ, పోలీసు, ఐఏఎస్, ఐపీఎస్, ప్రెస్, ఇన్కమ్ట్యాక్స్ ఇలా వివిధ విభాగాలు, అధికారుల సిఫార్సులపై, స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులకు బ్రేక్ దర్శనాలు ఇస్తున్న క్రమంలో ఉదయం ప్రారంభమవుతున్న బ్రేక్ దర్శనాలు మఽధ్యాహ్నం వరకు కొనసాగుతున్నాయి. కొంతమంది టీటీడీపై ఒత్తిడి చేసి అదనపు కోటాలో కూడా టికెట్లు పొందుతున్నారు. ఇదే పరిస్థితి వేసవిలోనూ కొనసాగితే సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉందని భావిస్తున్న టీటీడీ బ్రేక్ దర్శనాల కుదింపుపై కసరత్తు మొదలుపెట్టింది. రానున్న పది రోజుల్లో బ్రేక్ దర్శనం సమయాన్ని తగ్గించే అంశంపై ఉన్నతాధికారులు సమీక్షించనున్నారు. వేసవి సెలవుల్లో ప్రతి రోజు సర్వదర్శనం క్యూ లైన్ వెలుపలే ఉండే క్రమంలో సిఫార్సుపై లేఖలపై ఇచ్చే బ్రేక్ దర్శనాలను పూర్తిస్థాయిలో రద్దు చేసి బ్రేక్ దర్శనాన్ని కేవలం ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేసేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.