TDP Leaders : దళితులపై దాడి చేసిన వంశీకి జగన్ వత్తాసా!
ABN , Publish Date - Feb 19 , 2025 | 05:16 AM
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారంతా జగన్ తీరుపై ధ్వజమెత్తారు. గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ను వంశీ కిడ్నాప్ చేసి తీసుకెళుతున్న సీసీ కెమెరా ఫుటేజీని విడుదల చేశారు.

వృత్తిధర్మం నిర్వహిస్తున్న పోలీసుల్ని బెదిరిస్తారా?
జగన్పై మంత్రులు, టీడీపీ నేతల ధ్వజం
సత్యవర్ధన్ కిడ్నాప్ దృశ్యాలు విడుదల
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): దళితుడిని కిడ్నాప్ చేసి హింసించిన వల్లభనేని వంశీకి జగన్ వత్తాసు పలకడం దారుణమని పలువురు మంత్రులు, టీడీపీ నేతలు విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారంతా జగన్ తీరుపై ధ్వజమెత్తారు. గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ను వంశీ కిడ్నాప్ చేసి తీసుకెళుతున్న సీసీ కెమెరా ఫుటేజీని విడుదల చేశారు. అనంతరం ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఓ రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలు లేవని, అలాంటి నీచ సంస్కృతికి జగన్ తెరలే పారని విమర్శించారు. అందమంటే మీ దృష్టిలో గూండాయిజం, రౌడీయిజం, దోపిడీలు చేసేవారా అని ప్రశ్నించారు. అఽధికారం అడ్డం పెట్టుకుని కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, జోగి రమేశ్, పేర్ని నాని చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, చట్టం నుంచి వీరెవ్వరూ తప్పించుకోలేరని తేల్చిచెప్పారు. తప్పు చేసిన వారిని వదిలేది లేదన్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ రౌడీలకు, దొంగలకు జగన్ వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. వృత్తిధర్మం నిర్వహిస్తున్న పోలీసులను బెదిరించడం సమంజసమా? అని ప్రశ్నించారు. జగన్ తన తీరు మార్చుకోకపోతే ప్రజలు వైసీపీని భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం మాట్లాడుతూ దళిత బిడ్డను కిడ్నాప్ చేసిన వంశీ తన ఇంటికే తీసుకెళుతున్న సీసీ ఫుటేజీని విడుదల చేశామని, ఇప్పుడు వంశీ ఉత్తముడని జగన్ చెప్పగలరా అని నిలదీశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మనిషనే వాడు చేయని దుర్మార్గాలు చేసిన వంశీని జైలుకు వెళ్లి పరామర్శించడం కన్నా దారుణం ఏముంటుందన్నారు.
ఏ మొహం పెట్టుకొని పరామర్శించావ్: పల్లా
దళిత ఉద్యోగి సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి హింసించి హత్య చేస్తానని బెదిరించిన వంశీని ఏ మొహం పెట్టుకుని పరామర్శించారని జగన్ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నిలదీశారు. ఈ మేరకు జగన్కు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. జైలులో ఉన్న దళిత వ్యతిరేకి, మహిళాద్రోహి వంశీని పరామర్శించేందుకు మనసెలా అంగీకరిందని ప్రశ్నించారు. దళితులకన్నా నేరస్థుడు ఎక్కువయ్యాడా అని నిలదీశారు.