పాస్టర్ ప్రవీణ్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:52 AM
మత సామరస్యాన్ని కాపాడండి.. క్రైస్తవులకు రక్షణ కల్పించండి అంటూ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ మొగలి స్పర్జన్రాజు ఆధ్వర్యంలో జిల్లాలోని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు గురువారం ర్యాలీ జరిపారు.

అమలాపురం టౌన్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): మత సామరస్యాన్ని కాపాడండి.. క్రైస్తవులకు రక్షణ కల్పించండి అంటూ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ మొగలి స్పర్జన్రాజు ఆధ్వర్యంలో జిల్లాలోని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు గురువారం ర్యాలీ జరిపారు. జిల్లా నుంచి పాస్టర్లు, క్రైస్తవ విశ్వాసులు గడియార స్తంభం సెంటర్కు చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా నల్లవంతెన మీదుగా కలెక్టరేట్కు చేరుకున్నారు. వందలాది మంది ముక్తేశ్వరం రోడ్డులో కలెక్టరేట్ ఎదుట రాస్తారోకోకు దిగడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. అమలాపురం సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో ట్రాఫిక్ను మళ్లి ంచేందుకు శ్రమించారు. అదే సమయంలో 108 వాహనం రావడంతో దారి ఇచ్చి వారు మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రవీణ్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు కలెక్టరేట్ ఎదుట మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్ఎన్ రాజకుమారికి వినతిపత్రం అందజేశారు. నిరసన ర్యాలీలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఎర్నెస్ట్ తాతపూడి, ఎస్తేరు జ్యోతి తాతపూడి తదితరులు పాల్గొన్నారు. శాంతి ర్యాలీలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ సోంబాబు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి పొలమూరి మోహన్బాబు, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు తదితరులు సంఘీభావం తెలిపారు.