Share News

బోగస్‌ పత్రాలతో స్థలం అమ్మిన కానిస్టేబుల్‌

ABN , Publish Date - Jan 25 , 2025 | 06:30 AM

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు గవాస్కర్‌ అండతో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి బోగస్‌ డాక్యుమెంట్లతో తమ స్థలాన్ని కబ్జా చేసి....

బోగస్‌ పత్రాలతో స్థలం అమ్మిన కానిస్టేబుల్‌

  • శ్రీశైలంలో దుకాణాలు ఇప్పిస్తానని మోసం.. టీడీపీ గ్రీవెన్స్‌లో బాధితుల ఫిర్యాదులు

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుల భూ దందాలపై టీడీపీ గ్రీవెన్స్‌కు ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి రామనారాయణరెడ్డి, కురుబ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవేంద్రప్ప అర్జీలు స్వీకరించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు గవాస్కర్‌ అండతో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి బోగస్‌ డాక్యుమెంట్లతో తమ స్థలాన్ని కబ్జా చేసి, తమపైనే తప్పుడు కేసు పెట్టారని విజయవాడకు చెందిన రిటైర్డ్‌ టీచర్‌ అరవింద వాపోయారు. మైదుకూరు వైసీపీ నేత ఉపేంద్ర పట్టాభి తమ భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నాడని, న్యాయం చేయాలని కడప జిల్లా కేఎన్‌ కొట్టాలకు చెందిన కృష్ణకుమార్‌ కోరారు. సున్నిపెంటకు చెందిన వైసీపీ నాయకుడు సయ్యద్‌ నూరుబాష శ్రీశైలం దేవస్థానంలో దుకాణాలు ఇప్పిస్తానని రూ.10లక్షలు తీసుకుని మోసంచేశాడని రామయ్య ఫిర్యాదు చేశారు. జగనన్న కాలనీకి తీసుకున్న తన భూమికి పరిహారం ఇప్పించాలని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన ఆనంద్‌బాబు కోరారు. రంగయ్య అనే కానిస్టేబుల్‌ బోగస్‌ పత్రాలతో తన స్థలాన్ని అమ్మి, డబ్బులు కాజేశాడని నంద్యాల జిల్లా గడివేములకు చెందిన రామకృష్ణారావు వాపోయారు.

Updated Date - Jan 25 , 2025 | 06:30 AM