‘అన్న యోజన’లో అనర్హుల ఏరివేతకు ఐటీ డేటా
ABN , Publish Date - Feb 07 , 2025 | 05:05 AM
పేద కుటుంబాలకు ఉచితంగా రేషన్ అందించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకంలోని లబ్ధిదారుల్లో అనర్హులైన వారిని ఏరి వేసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది.

పన్ను చెల్లించే వారికి పథకం నిలిపివేత
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: పేద కుటుంబాలకు ఉచితంగా రేషన్ అందించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకంలోని లబ్ధిదారుల్లో అనర్హులైన వారిని ఏరి వేసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. దీనికోసం పన్ను చెల్లించే వారి వివరాలను ఆదాయ పన్ను శాఖ నుంచి ఆహార మంత్రిత్వ శాఖ తీసుకోనుంది. ఆదాయ పన్ను చెల్లించని పేదలకు మాత్రమే పీఎంజీకేఏవై పథకం వర్తిస్తుంది.
ఇటీవల ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో రూ. 2.03 లక్షల కోట్లను పీఎంజీకేఏవై పథకం కోసం కేంద్రం కేటాయించింది. ఈ నిధులు అర్హులకు మాత్రమే చేరాలని కేంద్రం భావిస్తోంది. ఆధార్, పాన్తో లింక్ అయిన పన్ను చెల్లింపుదారుల డేటాను ఆహారం, పౌర సరఫరాల శాఖ (డీఎ్ఫపీడీ)కు ఇవ్వనున్నామని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) తెలిపింది.