BJP: ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఇక్కడంటే..
ABN , Publish Date - Feb 19 , 2025 | 11:08 AM
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం మధ్యాహ్నం రామ్ లీలా మైదాన్లో జరగనుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కొత్త సీఎం చేత ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు.

న్యూఢిల్లీ: సీఎం ప్రమాణ స్వీకారానికి (Delhi New CM Oath) రామ్ లీలా మైదాన్ (Ram Leela Ground) ముస్తాబైంది. బీజేపీ (BJP) నాయకత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. భద్రతా కారణాలతో మైదానాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) స్వాధీనం చేసుకుంది. గురువారం మధ్యాహ్నం 12:05 గంటలకు సీఎం ప్రమాణ స్వీకారం జరగనుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రి చేత ప్రమాణం చేయించనున్నారు. రాంలీలా మైదానంలో సుమారు 30వేల మంది కూర్చునేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. మూడు పెద్ద స్టేజీలతో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేశారు. మెయిన్ స్టేజి మీద ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కూర్చుంటారు.
ఈ వార్త కూడా చదవండి..
గుంటూరు మిర్చి యార్డుకు జగన్ రెడ్డి
రెండవ స్టేజిపై మత పెద్దలకు సీటింగ్ ఏర్పాటు చేశారు. ఢిల్లీకి చెందిన ప్రస్తుత ఎంపీలు, ఎన్నికైన ఎమ్మెల్యేలు మూడవ వేదికపై కూర్చుంటారు. గురువారం ఉదయం 11:15 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:25 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగియనుంది. కాగా సినీ తారలు, ఇతర వీఐపీలకు స్టేజి ఎదురుగా సీటింగ్ ఏర్పాట్లు చేశారు.
ఢిల్లీ సీఎం ప్రమాణ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్..
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. ఇందు కోసం బుధవారం రాత్రి ఇద్దరు నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళతారు. అమరావతి నుంచి చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న పవన్ కల్యాణ్ ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీకి వెళతారు. రాత్రి ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్లో బస చేస్తారు.
కాగా బుధవారం మధ్యాహ్నం బీజేఎల్పీ సమావేశం (BJLP Meeting) కానుంది. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బీజేఎల్పీ నేతను ఎమ్మెల్యేలు (MLAs) ఎన్నుకోనున్నారు. దీంతో ఢిల్లీ నూతన సీఎంపై స్పష్టత వస్తుంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఢిల్లీ బీజేపీ ఎంపీలు కూడా పాల్గొంటారు. బీజేఎల్పీ నేత ఎన్నిక తర్వాత లెఫ్ట్నెంట్ గవర్నర్ను నేతలు కలవనున్నారు. ఇప్పటికే సిఎం ప్రమాణస్వీకారం కోర్డినేటర్లుగా వినోద్ తావ్డే, తరుణ్ చుగ్లను బీజేపీ అధిష్ఠానం నియమించింది.
27 ఏళ్ల తర్వాత అధికారంలోకి..
కాగా ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేసిన విషయం తెలిసిందే. దాదాపు 27 ఏళ్ల తర్వాత కమలం పార్టీ అధికారంలోకి వచ్చింది. మెుత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్తోపాటు పలువురు కీలక నేతలు ఓటమి పాలయ్యారు. ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం రామ్ లీలా మైదాన్లో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వివిధ రాష్ట్రాల్లోని ఎన్డీఏ పక్షాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
దుర్గగుడిలో ఉద్యోగుల అంతర్గత బదిలీల్లో మాయాజాలం
శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News