Share News

India vs England : చెపాక్‌లోనూ చెక్‌ పెట్టాలని..

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:29 AM

ఐదు టీ20ల సిరీ్‌సకు అదిరే ఆరంభాన్నిచ్చిన భారత జట్టు ఇప్పుడు మరో విజయంపై దృష్టి సారించింది. చెన్నై వేదికగా శనివారం ఇంగ్లండ్‌తో రెండో టీ20 ఆడనుంది. ముందుగా బౌలింగ్‌.. ఆ

India vs England : చెపాక్‌లోనూ చెక్‌ పెట్టాలని..

ఆత్మవిశ్వాసంతో టీమిండియా

నేడు ఇంగ్లండ్‌తో రెండో టీ20

రాత్రి 7 గం. నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

చెన్నై: ఐదు టీ20ల సిరీ్‌సకు అదిరే ఆరంభాన్నిచ్చిన భారత జట్టు ఇప్పుడు మరో విజయంపై దృష్టి సారించింది. చెన్నై వేదికగా శనివారం ఇంగ్లండ్‌తో రెండో టీ20 ఆడనుంది. ముందుగా బౌలింగ్‌.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ చెలరేగిన భారత్‌ పర్యాటక ఇంగ్లండ్‌ను తొలి మ్యాచ్‌లో బెంబేలెత్తించింది. కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ మినహా మరెవరూ భారత బౌలర్లను దీటుగా ఆడలేకపోవడంతో 132 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. సిరీ్‌సలో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్‌ అదే జోరును చెపాక్‌లోనూ చూపాలనుకుంటోంది. మరోవైపు సిరీ్‌సను సమం చేసేందుకు బట్లర్‌ సేన సమాయత్తమవుతోంది. అందుకు వారి బ్యాటర్లు స్థాయికి తగ్గట్టు రాణించాల్సి ఉంది. స్థానిక మైదానంలో కేవలం రెండు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు జరగ్గా వాటిల్లోనూ చివరి బంతికే ఫలితాలు తేలడం విశేషం.

షమి పరిస్థితేంటి?: తొలి టీ20లో షమి కచ్చితంగా ఆడతాడని భావించినా అలా జరగలేదు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలించనుందని షమిని పక్కనబెట్టారన్న కథనాలు వినిపించాయి. మరోవైపు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతడి ఫిట్‌నె్‌సను మరింత క్షుణ్ణంగా పరిశీలించాలనుకుని తొలి టీ20కి దూరంగా ఉంచిందని చెబుతున్నారు. అయితే చాంపియన్స్‌ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని షమి మ్యాచ్‌ ఫిట్‌నె్‌సను వీలైనంత త్వరగా పరీక్షించాల్సిన అవసరముంది. ఈనేపథ్యంలో చెపాక్‌లో అతడిని ఆడించే అవకాశాల్లేకపోలేదు. అయితే తొలి మ్యాచ్‌లో షమి లేకున్నా మరో పేసర్‌ అర్ష్‌దీప్‌, స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఇంగ్లండ్‌ను దెబ్బతీశారు. బ్యాటింగ్‌లో అభిషేక్‌-శాంసన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. షమి తుది జట్టులో ఉంటే నితీశ్‌ బెంచీకే పరిమితమవుతాడు. బ్యాటింగ్‌ బలంగా ఉండాలని భావిస్తేస్పిన్నర్‌ బిష్ణోయ్‌ను తప్పిస్తారు.

abhishek-sharma.jpg

అభిషేక్‌ అనుమానమే: శుక్రవారంనాటి నెట్‌ ప్రాక్టీస్‌లో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ కుడి చీలమండ బెణకడంతో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. నొప్పితో బయటికి వెళ్లిన అభిషేక్‌ మళ్లీ ప్రాక్టీస్‌కు రాలేదు. ఒకవేళ అభిషేక్‌ ఆడకపోతే సంజూకు తోడుగా తిలక్‌వర్మ లేదా ధ్రువ్‌ జురెల్‌ దిగే అవకాశముంది.


అట్కిన్సన్‌పై వేటు: భారత్‌తో రెండో టీ20కి ఇంగ్లండ్‌ 12 మంది ఆటగాళ్లను ప్రకటించింది. అట్కిన్సన్‌ స్థానంలో బ్రైడన్‌ కార్స్‌ను తీసుకున్నారు. అలాగే బేథెల్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బేథెల్‌ ఆడకపోతే జేమీ స్మిత్‌ టీ20ల్లో అరంగేట్రం చేయగలడు. పేసర్లు ఆర్చర్‌, ఉడ్‌, కార్స్‌ ఈసారి భారత్‌ను ఇబ్బందిపెట్టాలనుకుంటున్నారు.

జట్లు

భారత్‌ (అంచనా): అభిషేక్‌/జురెల్‌, శాంసన్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), హార్దిక్‌, రింకూ సింగ్‌, అక్షర్‌, నితీశ్‌, అర్ష్‌దీప్‌, బిష్ణోయ్‌/షమి, వరుణ్‌ చక్రవర్తి.

ఇంగ్లండ్‌(తుది జట్టు): డకెట్‌, సాల్ట్‌, బట్లర్‌ (కెప్టెన్‌), బ్రూక్‌, లివింగ్‌స్టోన్‌, బెథెల్‌/స్మిత్‌, ఒవెర్టన్‌, కార్స్‌, ఆర్చర్‌, రషీద్‌, ఉడ్‌.

పిచ్‌..

గతేడాది ఐపీఎల్‌లో ఈ వేదికపై తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 170. జరిగిన 9 మ్యాచ్‌ల్లో ఆరు సార్లు ఛేజింగ్‌ జట్లే నెగ్గాయి. ఇక్కడ మంచు ప్రభావం ఎక్కువే కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ వైపు మొగ్గు చూపవచ్చు. అయితే 2024 లీగ్‌లో స్పిన్‌కన్నా పేసర్లు ఎక్కువగా లాభపడడంతో రెండు జట్లు దీనికి తగ్గట్టుగానే బరిలోకి దిగే అవకాశం ఉంది.

Updated Date - Jan 25 , 2025 | 12:30 AM