Akbaruddin Owaisi: ప్రశ్నలకు సమాధానమివ్వకుండా దాటవేస్తారా
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:00 AM
ఇదేనా ప్రజాస్వామ్యం, ఇంత అన్యాయం చేస్తే ఎలా, ఇదేమైనా గాంధీభవన్ అనుకుంటున్నారా.. అంటూ మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభలో తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

ప్రశ్నోత్తరాల్లో అక్బరుద్దీన్ మండిపాటు.. వాకౌట్
ఇదేనా ప్రజాస్వామ్యం, ఇంత అన్యాయం చేస్తే ఎలా, ఇదేమైనా గాంధీభవన్ అనుకుంటున్నారా.. అంటూ మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభలో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల్లో ‘ప్రభుత్వం జారీ చేసిన జీవోలెన్ని, వాటిలో ఎన్ని జీవోలను, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో)లను పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచారు...? వాటి వివరాలెన్నీ’ అని ఒక ప్రశ్న వేశారు. అయితే సోమవారం సభ ప్రారంభమైన తర్వాత ఉదయం 10 నుంచి 11 గంటల దాకా ప్రశ్నోత్తరాలు పూర్తిచేయాలని సభ్యులను స్పీకర్ కోరారు.
సభ్యులడిగిన నాలుగు ప్రశ్నలకు జవాబులు ఇచ్చేసరికి సమయం 11:29 గంటలు కావడంతో స్పీకర్ మిగిలిపోయిన ప్రశ్నలకు ‘డీమ్డ్ టూ ఆన్సర్’ (ప్రశ్నలకు జవాబులు ఇచ్చినట్లు పరిగణనలోకి తీసుకోవాలని) ప్రకటిస్తూ జీరో అవర్ను ప్రారంభించారు. దాంతో అక్బరుద్దీన్ నిరసన వ్యక్తం చేశారు. రంజాన్ మాసంలో ఉపవాసముంటూ ప్రశ్నలపై మాట్లాడాలని ఓపికగా సభకు వస్తే, ప్రశ్నోత్తరాల్లో మిగిలిన ప్రశ్నలను ఈ విధంగా దాట వేస్తారా అని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.