ACB: ఏసీబీ వలలో సబ్రిజిస్ట్రార్, ఆఫీస్ అసిస్టెంట్
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:18 AM
తండ్రి పేరిట ఉన్న ఇంటి స్థలాన్ని అన్నదమ్ముల పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ సబ్ రిజిస్ట్రార్ పర్వతం రామకృష్ణ, ప్రైవేట్ ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎదునూరి రమేష్ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

స్టేషన్ఘన్పూర్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): తండ్రి పేరిట ఉన్న ఇంటి స్థలాన్ని అన్నదమ్ముల పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ సబ్ రిజిస్ట్రార్ పర్వతం రామకృష్ణ, ప్రైవేట్ ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎదునూరి రమేష్ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం... చిలుపూరు మండలం వెంకటేశ్వరపల్లెకు చెందిన బట్టమేకల శివరాజ్శివరాజ్, ధర్మరాజు అన్నదమ్ములు. తమ తండ్రి పేరిట ఉన్న 585 గజాల ఇంటి స్థలాన్ని తమ పేరుపై గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలంటూ వారి తండ్రిని తీసుకుని ఈనెల 17న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు.
ఇద్దరి పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని సబ్ రిజిస్ట్రార్ మెలికపెట్టారు. తర్వాత రమేష్ రంగంలోకి దిగి ఇద్దరి పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక్కొక్కరు రూ.11వేల చొప్పున ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తారని బేరం పెట్టాడు. శివరాజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచన మేరకు రూ.20వేలు ఇస్తానని సబ్రిజిస్ట్రార్కు తెలపడంతో రిజిస్ట్రేషన్ చేసేందుకు అంగీకరించాడు. పథకం ప్రకారం గురువారం శివరాజ్ రిజిస్ర్టేషన్ కార్యాలయానికి వచ్చి రమే్షకు రూ.20వేలు ఇవ్వగా ఆయన ద్వారా సబ్రిజిస్ట్రార్ తీసుకుంటున్న క్రమంలో అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.