Share News

Medak: కాలికి, చేతికి వైరు చుట్టి కరెంట్‌ షాక్‌ పెట్టి..

ABN , Publish Date - Jan 19 , 2025 | 03:17 AM

వదినతో వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని అన్ననే చంపేశాడో తమ్ముడు.. అన్న నిద్రలో ఉండగా అతని కాలు, చేతికి విద్యుత్‌ వైర్లు చుట్టి.. కరెంట్‌ షాక్‌ పెట్టి ప్రాణం తీశాడు.

Medak: కాలికి, చేతికి వైరు చుట్టి కరెంట్‌ షాక్‌ పెట్టి..

  • అన్నను చంపిన తమ్ముడు.. వదినతో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఘాతుకం

శివ్వంపేట, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): వదినతో వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని అన్ననే చంపేశాడో తమ్ముడు.. అన్న నిద్రలో ఉండగా అతని కాలు, చేతికి విద్యుత్‌ వైర్లు చుట్టి.. కరెంట్‌ షాక్‌ పెట్టి ప్రాణం తీశాడు. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం నానుతండాలో జరిగిన ఈ ఘటనలో తేజావత్‌ శంకర్‌(28) తన తమ్ముడి చేతిలో హతమయ్యాడు. పోలీసుల వివరాల మేరకు. నాను తండాకు చెందిన శంకర్‌ (28), గోపాల్‌ (20) అన్నదమ్ములు. శంకర్‌ గతంలో రెండు వివాహాలు చేసుకుని విడాకులు తీసుకున్నాడు. ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఏడాది క్రితం తల్లిదండ్రులు లేని మరో యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుని తండాకు తీసుకొచ్చాడు. అయితే, శంకర్‌ భార్యతో గోపాల్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.


తన భార్యతో గోపాల్‌ సన్నిహితంగా ఉండడాన్ని చూసిన శంకర్‌ తన భార్య జోలికి రావొద్దని హెచ్చరించాడు. అయినా, గోపాల్‌ మారకపోవడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టారు. దీంతో శంకర్‌ భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి శంకర్‌పై గోపాల్‌ కక్ష పెంచుకున్నాడు. అయితే ఓ చోరీ కేసులో ఇటీవల జైలుకు వెళ్లి వచ్చిన గోపాల్‌ అవకాశం కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలో శంకర్‌ మద్యం తాగి శుక్రవారం రాత్రి నిద్రపోయాడు. అతని వద్దే నిద్రించిన గోపాల్‌ అర్ధరాత్రి తర్వాత మేల్కోని.. శంకర్‌ కాలు, చేతికి విద్యుత్‌ వైర్లు చుట్టి ప్లగ్‌ బోర్డులో స్విచ్‌ ఆన్‌ చేశాడు. దీంతో శంకర్‌ విద్యుదాఘాతానికి గురై కేకలు వేశాడు. ఈ అలికిడికి నిద్ర లేచిన వారి తండ్రి చందర్‌.. తలుపులు తీయమని అరిచాడు. తలుపు తీసిన గోపాల్‌ తండ్రి చందర్‌ను నెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు గోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Jan 19 , 2025 | 03:17 AM