Anchor Shyamala Investigation: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల ఎదుట యాంకర్ శ్యామల
ABN , Publish Date - Mar 24 , 2025 | 10:49 AM
Anchor Shyamala Investigation: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో యాంకర్ శ్యామల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు పోలీసుల విచారణను ఎదుర్కున్నారు.

హైదరాబాద్, మార్చి 24: బెట్టింగ్ యాప్స్ కేసులో (Bettin Apps Case) పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో యాంకర్ శ్యామల (Anchor Shyamala) పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరయ్యారు. న్యాయవాదితో కలిసి విచారణకు వచ్చారు శ్యామల. బెట్టింగ్ యాప్ కేసులో శ్యామలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణకు వచ్చిన యాంకర్ నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 8:44 గంటల ప్రాంతంలో యాంకర్ పంజాగుట్ట పీఎస్కు వచ్చారు. సుమారు గంటన్నర పాటుగా ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ను యాంకర్ శ్యామల కూడా చేసిన విషయం తెలిసిందే.
ఒక సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణకు రావాల్సిందిగా గతంలో పోలీసులు ఒకసారి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు ఆమె స్పందించలేదు. విచారణకు హాజరుకాకుండా నేరుగా శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే క్వాష్ పిటిషన్ను కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు.. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చారు. శ్యామలను అరెస్టు చేయవద్దని, నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అలాగే ఈరోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఉదయమే శ్యామల విచారణకు వచ్చారు. ఆంధ్రా 365 అనే బెట్టింగ్ యాప్ను గత కొంతకాలంగా శ్యామల ప్రమోట్ చేశారు. న్యాయవాదితో కలిసి యాంకర్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.
TDP vs YSRCP: వైసీపీకి టీడీపీ సరికొత్త సవాల్ టార్గెట్ అదేనా
కాగా.. బెట్టింగ్ యాప్స్కు సంబంధించి పంజాగుట్ట పోలీస్స్టేషన్లో 11 మందిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురిని పోలీసులు విచారించారు. తేజ, కానిస్టేబుల్ కిరణ్, విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించి వారి వద్ద నుంచి స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా యాంకర్ శ్యామలను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో పరారీలో ఉన్న వారికి మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ వ్యవహారంలో యూట్యూబర్ భయా సన్నీ యాదవ్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అతడు విదేశాల్లో ఉండటంతో లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం సన్నీ యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. సన్నీ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈరోజు (సోమవారం) హైకోర్టులో విచారణ జరుగనుంది.
ఇవి కూడా చదవండి...
Attack On Bollywood Actress: షాప్ ఓపెనింగ్కు వచ్చిన బాలీవుడ్ నటికి ఊహించని షాక్
Hyderabad Explosion: హైదరాబాద్లో భారీ పేలుడు... ఏం జరిగిందంటే
Read Latest Telangana News And Telugu News