Hyderabad: విదేశాల్లో భారతీయులకు విస్తృత అవకాశాలు
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:28 PM
భారతీయ విద్యార్థులకు విదేశీ విద్య సంస్థలో ముఖ్యంగా ఆస్ట్రేలియాలో విస్తృత అవకాశాలు ఉన్నాయని దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్ (ప్రభుత్వ అధినేత) పీటర్ మలినౌస్కస్ తెలిపారు.

హైదరాబాద్: భారతీయ విద్యార్థులకు విదేశీ విద్య సంస్థలో ముఖ్యంగా ఆస్ట్రేలియాలో విస్తృత అవకాశాలు ఉన్నాయని దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్ (ప్రభుత్వ అధినేత) పీటర్ మలినౌస్కస్ తెలిపారు. పరిశోధన ఆధారిత కోర్సుల ఫలితంగా వారిలో నైపుణ్యాలు పెరిగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. వీసా నిబంధనలు కూడా కఠినంగా లేవని చెప్పారు. బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన స్టడీ అడిలైడ్ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ.. 'ఆస్ట్రేలి యాలో ఆర్అండ్, టెక్, సైన్స్, హాస్పిటాలిటీ, ఇంజినీరింగ్ విభాగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి. భారత విద్యార్థులు కొత్త అంశాలను తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. ఇదే వారిని అన్ని రంగాల్లో ముందంజలో నిలుపుతోంది. దక్షిణ ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియాలు టాప్ యూనివర్సిటీలుగా ఉన్నాయి. ఇక్కడ ప్రవేశాలు పొందిన వారికి మెరిట్ ఆధారిత స్కాలర్షిప్స్ కూడా లభిస్తాయి' అని తెలిపారు. దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వం పరిశోధనలు, ఉన్నత విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అదే విధంగా దక్షిణ ఆస్ట్రేలియాలో పోస్ట్ స్టడీ వర్క్ విషయంలో నిర్దేశిత సమయానికి అదనంగా మరో ఏడాది ఉద్యోగం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
400లకుపైగా..
కాగా, మలినౌస్కస్, భారత్లో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్, ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిలరీ మెక్ గ్చి సమక్షంలో ఫ్లిండర్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కలసి హెల్త్ కేర్, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాల్లో జాయింట్ ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు స్టడీ అడి లైడ్ కార్యక్రమంలో భాగంగా ఎంప్లాయిమెంట్ కనెక్ట్ పేరుతో కొత్త విధానాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్టడీ అడిలైడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేన్ జాన్స్టన్ మాట్లాడుతూ గత రెండేళ్లలో 400 మందికిపైగా భారత విద్యార్థులు దక్షిణ ఆస్ట్రే లియాలో ఉపాధి పొందారని చెప్పారు. ఈ సదస్సులో భాగంగా పలువురు ప్రముఖులతో ప్యానెల్ డిస్కషన్స్ జరిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ డీన్ ప్రొఫెసర్ జీవీఆర్కే ఆచార్యులు, ఒనెస్ క్రయోజెనిక్స్ సీఈఓ రామ్ తదితరులు పాల్గొన్నారు.