సంక్షేమ పథకాలకు రేషన్కార్డు అడ్డంకి
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:52 AM
సంక్షేమ పథకాలన్నీంటికి ప్రభుత్వం రేషన్కార్డును తప్పనిసరి చేసింది. నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలు అందించేందుకు ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి రేషన్ కార్డును లింక్ చేసింది. రేషన్కార్డు లేని నిరుద్యోగులు పథకానికి దూరమవుతున్నారు. దాదాపు ఐదేళ్ళ క్రితం కొత్త రేషన్ కార్డులు జారీ చేయగా అప్పటి నుంచి రేషన్ కార్డు కోసం అర్హులైన లబ్ధిదారులు ఎదురుచూస్తున్నార.

సంక్షేమ పథకాలన్నీంటికి ప్రభుత్వం రేషన్కార్డును తప్పనిసరి చేసింది. నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలు అందించేందుకు ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి రేషన్ కార్డును లింక్ చేసింది. రేషన్కార్డు లేని నిరుద్యోగులు పథకానికి దూరమవుతున్నారు. దాదాపు ఐదేళ్ళ క్రితం కొత్త రేషన్ కార్డులు జారీ చేయగా అప్పటి నుంచి రేషన్ కార్డు కోసం అర్హులైన లబ్ధిదారులు ఎదురుచూస్తున్నార.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్ కార్డుతో లింకు పెడతుండడంతో కార్డులు లేని వారికి శరాఘాతంగా మారింది. తాజాగా రాజీవ్ యువ వికాసం పథకానికి కూడా రేషన్ కార్డుతో లింకు పెట్టింది. దీంతో రేషన్ కార్డులు లేని నిరుద్యోగులు ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తున్నది. రేషన్ కార్డులు ఇప్పుడు ఇస్తాం.. అప్పుడు ఇస్తాం.. అంటూ ఊరిస్తున్న ప్రభుత్వం ఏడాదిన్నర గడుస్తున్నా కార్డులు జారీ చేయకపోవడంతో అనేక మంది ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు.
ఫ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు..
నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా 50 శాతం వరకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి యూనిట్ను బట్టి 40 నుంచి 80 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు రాకపోయినా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు విధించారు. ఏ జిల్లాకు ఎన్ని యూనిట్లు ఇవ్వాలనే టార్గెట్లు కూడా ప్రకటించ లేదు. గతంలో ఆయా కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి డేటాను వెబ్సైట్ నుంచి తొలగించకపోవడంతో కొత్తగా దరఖాస్తులు ఎంట్రీ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకానికి కూడా రేషన్ కార్డుతో ముడి పెట్టడంతో కార్డులు లేని వాళ్లు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ కార్డు లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే స్వీకరించడం లేదని పలువురు నిరుద్యోగులు తెలిపారు.
ఫ అన్ని పథకాలకు రేషన్ కార్డుతో లింకు..
ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుతో ముడి పెట్టడం కార్డుల లేని వారికి శాపంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో చివరగా 2021లో కొత్త రేషన్ కార్డులను జారీ చేశారు. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులను జారీ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం చేపట్టిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలన గ్రామ, పట్టణ సభల్లో ఐదు గ్యారంటీ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం రేషన్కార్డులు లేని వారి నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు కార్డులను జారీ చేయలేదు. ఈ ఏడాది జనవరి 26వ తేదీన పైలట్ ప్రాజెక్టులో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి కార్డులను జారీ చేసింది. గ్రామ, పట్టణ సభల్లో కొత్తగా మరిన్ని దరఖాస్తులు స్వీకరించారు. మీసేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారు. కానీ కొత్త కార్డులను జారీ చేయడంలో ప్రభుత్వం తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నది. ఇప్పుడు, అప్పుడు మంత్రులు ఊదర గొడుతున్నారే గానీ కార్డులు మాత్రం ఇవ్వక పోవడంతో ఆయా పథకాలకు అర్హులైన వాళ్లు సంక్షేమ ఫలాలను అందుకోలేక పోతున్నారు. రేషన్ కార్డు లేక అనేక మంది 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500లకు సబ్సిడీ గ్యాస్, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం ఇలా ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందలేక పోతున్నారు. తాజాగా రాజీవ్ యువ వికాసం పథకానికి కూడా రేషన్ కార్డు తప్పరిసరిగా ఉండాలని నిబంధన విధించడంతో కార్డులు లేని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. రేషన్ కార్డుల కోసం జిల్లాలో సుమారు 20 వేల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సత్వరమే రేషన్ కార్డులను జారీ చేసి రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకునే గడువును మరో 15 రోజులు పొడిగించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
ఈ విషయమై ఆంధ్రజ్యోతి జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి రాజేందర్ను వివరణ కోరగా, ‘రేషన్ కార్డుల కోసం తమకు వచ్చిన దరఖాస్తులను, మీ సేవా ద్వారా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి వారి వివరాలను ప్రభుత్వానికి పంపించాం. కానీ ఇంకా అర్హులైన వారి ఎంపిక జరగ లేదు. ప్రభుత్వం నుంచి అర్హులైన వారి జాబితా రాగానే కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తాం’ అని తెలిపారు.