Venkaiah Naidu: తెలుగు ప్రజలకు సంక్రాంతి ఎంతో ప్రత్యేకం
ABN , Publish Date - Jan 13 , 2025 | 04:47 AM
తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ ఎంతో ప్రత్యేకమైనదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

ఇది రైతుల పండుగ: వెంకయ్యనాయుడు
మొయినాబాద్ రూరల్/న్యూఢిల్లీ, జనవరి 12(ఆంధ్రజ్యోతి): తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ ఎంతో ప్రత్యేకమైనదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇది రైతుల పండుగ అని, తాను కూడా రైతు బిడ్డనేనని, అందుకే ఈ పండుగకు అధిక ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్నగర్లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో వెంకయ్యనాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తెలుగుభాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.
పాశ్చాత్య జీవనాన్ని అనుకరించడం మాని భారతీయ జీవన విధానాన్ని ఆచరించాలన్నారు. రఘోత్తంరెడ్డి రచించిన సంప్రదాయ జీవన విధానాన్ని ప్రతిబింబించే రెండు పుస్తకాలను వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా ఆవిష్కరించారు. వివేకానందుడి జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటల రాజేందర్, మాజీ ఎంపీ కేవీపీ పాల్గొన్నారు. కాగా, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సోమవారం నిర్వహించనున్న సంక్రాంతి ఉత్సవాలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.