Adilabad: నేటి నుంచి నాగోబా మహా జాతర
ABN , Publish Date - Jan 28 , 2025 | 05:20 AM
ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా మహా జాతరకు అంతా సిద్ధమైంది.

30న పెద్ద దేవతకు పూజలు .. 31న నాగోబా దర్బార్
ఇంద్రవెల్లి, జనవరి27(ఆంధ్రజ్యోతి): ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా మహా జాతరకు అంతా సిద్ధమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం రాత్రి 11గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర ప్రారంభం కానుంది. ఈనెల 30వ తేదీన ఆలయం వెనుక ఉన్న పెద్ద దేవతకు పూజలు నిర్వహించే కార్యక్రమం ఉంటుంది.
31న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్ నిర్వహించి గిరిజనుల సమస్యలను తెలుసుకుంటారు. ఫిబ్రవరి 1న భేతల్ పూజలు, మండ గాజిలి పూజలు చేయడంతో నాగోబా జాతర అధికారికంగా ముగుస్తుంది. జాతరకు వచ్చే భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.