Share News

‘థర్మల్‌’ నిర్వాసిత కుటుంబాల్లో వెలుగులు

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:45 PM

యాదాద్రి థర్మల్‌ విద్యుత పరిశ్రమలో భూములు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం ఉపాధి, నివాస గృహాలు ఏర్పాటు చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో హైదరాబాద్‌లోని ప్రజాభవనలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క శుక్రవారం బాధిత కుటుంబాలకు ఉద్యోగ నియామకపత్రాలు అందించడంతో వారి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

 ‘థర్మల్‌’ నిర్వాసిత కుటుంబాల్లో వెలుగులు

(ఆంధ్రజ్యోతి- దామరచర్ల)

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద యాదాద్రి థర్మల్‌ విద్యుత పరిశ్రమ ఏర్పా టుకు కావాల్సిన నీటి వనరులు, పరిశ్రమకు సరిపడా భూములు ఉన్నాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2015 జూలై 8న 4వేల మెగావాట్ల విద్యుత సామర్థ్య కలిగిన యాదాద్రి విద్యుత పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. పరిశ్రమ కోసం మొత్తం 4,676 ఎకరాల భూమిని మండలంలోని వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం, తిమ్మాపురం, నర్సాపురంగ్రామాలతోపాటు మోదుగులతండా, కపూరాతండా గ్రామాల నుంచి పట్టా, ఉడాఫ్‌, వివిధ రకాల భూములను అధికారులు సేకరించారు. ఇందులో మోదుగులతండా తండా, కపూరతండా రెండు గ్రామాలు భూములతోపాటు ఇళ్లు పరిశ్రమ ఏర్పాటు ప్రాంతంలో ఉండడంతో రెండు గ్రామాలను ఖాళీ చేయించి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించారు. మొత్తం 520 మంది రైతులు భూములు కోల్పోయారు. వారిలో తొలి విడతగా మోదుగులతండా, కపూరతండాకు చెందిన భూములతోపాటు ఇళ్లు కోల్పోయిన మొత్తం 173 మందిని మొదటి విడతలో అర్హులుగా ఎంపిక చేశారు. వీరిలో 40 మంది వయస్సు రీత్యా, వివిధ కారణాలతో ప్రభుత్వం అందించిన నగదు ప్రోత్సహాకాన్ని తీసుకున్నారు. మిగిలిన 133 మందిలో స్వల్ప కారణాలతో 21 మంది ఉద్యోగ నియామకపత్రాలు పరిశీలనలో ఉండగా 112 మందికి తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ కేతావత శంకర్‌నాయక్‌, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, టీఎ్‌సజెనకో అధికారుల సమక్షంలో నియామకపత్రాలను అందించారు. వీరు నెల రోజుల వ్యవధిలో పరిశ్రమలో విధుల్లో హాజరు కావాలని నియామకపత్రంలో పేర్కొన్నారు. దీంతో భూములు కోల్పోయి ఉద్యోగాలు పొందిన రైతుల మొఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. భూములు కోల్పోయిన వారికి కూడా త్వరలోనే ఉదో ్యగ నియామకపత్రాలు అందజేసేందుకు కృషి చేస్తా మన్నారు. దామరచర్ల మండలంలో అత్యధిక శాతం గిరిజనులు ఉన్నందున వారి కోసం ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎ ంను కోరారు.

ప్రత్యేక బస్సులో ప్రజాభవనకు

కాగా పరిశ్రమ ఏర్పాటులో భూములు కోల్పోయిన మోదుగులకుంట, కపూరతండా గ్రామాలకు చెందిన తొలివిడత ఉద్యోగానికి అర్హత పొందిన 112 మందిని స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెలీ శంకర్‌నాయక్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సుల్లో ప్రజాభవనకు తరలివెళ్లారు.

అక్కడ డిప్యూటీ సీఎంతోపాటు జెనకో అధికారుల సమక్షంలో ఉద్యోగ నియామకపత్రాలను అం దుకున్నారు.

అర్హతకు తగిన ఉద్యోగం

యాదాద్రి థర్మల్‌ పరిశ్రమలో భూములు, ఇండ్లు కోల్పోయిన మోదుగులకుంతండా, కపూరతండాకు చెందిన 112 మందికి అర్హతకు తగిన విధంగా నా లుగు విభాగాలుగా ఉద్యోగ నియామకపత్రాలను అందజేశారు. డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఆపై ఉన్నత చదువులు చదివిన 21 మందిని జూనియర్‌ అసిస్టెంట్లుగా, డిప్లొమో, ఐటీఐ పూర్తి చేసిన 39 మందికి జూనియర్‌ ప్లాంట్‌ అటెండెట్‌గా నియమించారు. మిగిలిన 52 మందిలో కొందరిని 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ చదివిన వారికి సబార్డినేట్‌ పోస్టులను కేటాయించగా పదోతరగతి కంటే తక్కువ చదివిన వారిని హౌస్‌ కీపింగ్‌ పోస్టుల్లో తీసుకున్నారు

Updated Date - Apr 05 , 2025 | 11:45 PM