Rythu Bharosa: సాగుభూముల సర్వే ఎలా చేద్దాం?
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:35 AM
ఈ నెల 26 నుంచి విడతల వారీగా రైతు భరోసా సొమ్ము చెల్లించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ లోపే సాగుభూముల సర్వే చేపట్టేందుకు సన్నద్ధమైంది.

నేడు ఎంసీహెచ్ఆర్డీలో 4 జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 26 నుంచి విడతల వారీగా రైతు భరోసా సొమ్ము చెల్లించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ లోపే సాగుభూముల సర్వే చేపట్టేందుకు సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు సమీపంలో ఉన్న నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో మంగళవారం రెవెన్యూ శాఖ పర్యవేక్షణలో సమావేశం ఏర్పాటు చేశారు.
ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించే ఈ సమావేశానికి రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, మెదక్ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ), ఏడీ సర్వే, ఏడీ వ్యవసాయం, తహసీల్దార్లు, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు హాజరుకావాలని సోమవారం రెవెన్యూ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ సర్క్యులర్ పంపారు. సమావేశంలో సాగు విస్తీర్ణంపై ఏ తరహా సర్వే చేపట్టాలనేదానిపై అధికారుల నుంచి వివరాలు సేకరించనున్నట్లు తెలిసింది.