ఎమ్మెల్యే కృష్ణారావుకు చేదు అనుభవం

ABN , First Publish Date - 2022-11-10T00:46:06+05:30 IST

డివిజన్‌ పరిధిలోని మల్లికార్జుననగర్‌ రోడ్‌ నెంబర్‌ 3లో రూ. 20 లక్షలతో చేపట్టిన యూజీడీ లైన్‌ పనులను బుధవారం కార్పొరేటర్‌ ముద్దం నర్సింహయాదవ్‌తో కలిసి ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కృష్ణారావుకు కాలనీవాసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది.

ఎమ్మెల్యే కృష్ణారావుకు చేదు అనుభవం

  • కార్పొరేటర్‌పై కాలనీవాసుల ఫిర్యాదు

ఓల్డ్‌బోయినపల్లి, నవంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): డివిజన్‌ పరిధిలోని మల్లికార్జుననగర్‌ రోడ్‌ నెంబర్‌ 3లో రూ. 20 లక్షలతో చేపట్టిన యూజీడీ లైన్‌ పనులను బుధవారం కార్పొరేటర్‌ ముద్దం నర్సింహయాదవ్‌తో కలిసి ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కృష్ణారావుకు కాలనీవాసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. చిన్న వర్షం పడినా మోకాళ్లలోతు నీళ్లు చేరి ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే ముందు వాపోయారు. నాలుగు గంటలకొకసారి అప్రకటిత విద్యుత్‌ కోత తీవ్ర సమస్యగా మారిందని, సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్‌ను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని, ఫోన్‌ చేసినా తీయడం లేదని వారు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఊహించని పరిణామంతో కంగుతిన్న కార్పొరేటర్‌, అతని వెంట ఉన్న నాయకులు స్థానికులకు సర్ధి చెబుతుండగా, సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించి ఎమ్మెల్యే కృష్ణారావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేదే లేదని అన్నారు. డివిజన్‌లో పెండింగ్‌ పనులను సకాలంలో పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - 2022-11-10T00:46:08+05:30 IST