వైసీపీకి షాక్..!
ABN , First Publish Date - 2023-10-17T00:50:19+05:30 IST
శ్రీశైలం నియోజకవర్గం కేంద్రబిందువైన ఆత్మకూరులో అధికార వైసీపీకి గట్టి షాక్ తగిలింది.

అనుచరులతో టీడీపీలో చేరిన
నియోజకవర్గ వైసీపీ వాణిజ్య సెల్
అధ్యక్షుడు కొప్పరపు రవిప్రసాద్
టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్
ప్రభుత్వ దాష్టీకం కలచివేసింది :
రవిప్రసాద్
ఆత్మకూరు, అక్టోబరు 16: శ్రీశైలం నియోజకవర్గం కేంద్రబిందువైన ఆత్మకూరులో అధికార వైసీపీకి గట్టి షాక్ తగిలింది. తొలి నుంచి వైసీపీలో కొనసాగిన ఆ పార్టీ నియోజకవర్గ వాణిజ్యసెల్ అధ్యక్షుడు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, రవి మొబైల్స్ అధినేత కొప్పరపు రవికుమార్ వైసీపీకి రాజీనామా చేసి సోమవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముందుగా కేజీరోడ్డులోని రవిమొబైల్స్ నుంచి మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సారధ్యంలో భారీ ర్యాలీగా గౌడ్సెంటర్కు చేరుకున్నారు. అక్కడ దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిని గజమాలతో సత్కరించారు. అనంతరం శ్రీశైల జగద్గురుమఠంలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా కొప్పరపు రవిప్రసాద్కు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవిప్రసాద్ మాట్లాడుతూ తొలి నుంచి వైసీపీలో కొనసాగిన తాను గత ఎన్నికల్లో ఎమ్మెల్యే శిల్పా విజయానికి ఎంతో కృషిచేశానని చెప్పారు. తనలాంటి నిజాయితీ గల వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం దాష్టికాన్ని ప్రదర్శించి అక్రమ అరెస్టు చేయడం కూడా తనని కలచివేసిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకుని టీడీపీలోకి చేరినట్లు వివరించారు. రాబోయే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే బుడ్డాను గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని స్పష్టం చేశారు. తనలాగే పార్టీ మారేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారని, త్వరలో టీడీపీలోకి వలసలు రావడం ఖాయమని స్పష్టం చేశారు. అనంతరం ఈయన వెంట పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు.