Ayyanna Patrudu: ఆ మంత్రి సంగతంతా నాకు తెలుసు..

ABN , First Publish Date - 2023-07-19T16:09:40+05:30 IST

ప.గో. జిల్లా: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు డిప్యూటీ సీఎం, మంత్రి కొట్టు సత్యనారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ..

Ayyanna Patrudu: ఆ మంత్రి సంగతంతా నాకు తెలుసు..

ప.గో. జిల్లా: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) డిప్యూటీ సీఎం (Deputy CM), మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana)పై తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మంత్రి కొట్టు సత్యనారాయణ నీ సంగతంతా నాకు తెలుసు.. మా ఖర్మ కాలి నువ్వు మంత్రివి అయ్యావు.. మంత్రి ఫోన్ చేస్తేనే పనవుతుందని అందరూ చెబుతున్నారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 42 వేల ఎకరాల దేవాలయ భూములు కనిపించడం లేదని మంత్రి అన్నారని.. దేవాలయ భూములను మీరు వదలరా?.. ఏమయ్యాయి ఆ భూములు అని అయ్యన్న ప్రశ్నించారు.

ప్రజలతో మద్యం తాగించి, ఆ డబ్బులన్నీ సీఎం జగన్ (CM Jagan) దోచుకుంటున్నారని, పెన్షన్లను దపదఫాలుగా పెంచుతూ, ప్రజలు ఒక్కొక్కరికి రూ. 26వేల నష్టం చేకూర్చారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. రాష్ట్రం తగులబడిపోయిందని.. ఇప్పటి వరకు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని, అసమర్ధులందరూ మంత్రులయితే రాష్ట్రం ఎలా బాగు పడుతుందని ఆయన నిలదీశారు. రంగుల రాణి మంత్రి రోజాను ఏదైనా ప్రాజెక్టు అడిగితే.. ‘నా సొగసు చూడు మాయా అంటుంది’ అని అన్నారు. అల్లూరి శత జయంతి ఉత్సవాలు ఈ జిల్లాలో బాగా జరిగితే, విశాఖలో మాత్రం ప్రభుత్వం చేయలేదని విమర్శించారు.

ఈ మంత్రులకు పాలన సాధ్యం కాదని.. కేసులు పెట్టడం మాత్రమే తెలుసునని అయ్యన్న పాత్రుడు విమర్శించారు. తనపై లైంగిక దాడి కేసు పెట్టారని, ఈ వయస్సులో తాను లైంగిక దాడి చేయగలనా? అని అన్నారు. ‘అమ్మా భారతి.. సాక్షి పేపరు ద్వారా బీసీలను విడగొట్టడానికి ప్రయత్నం చేయకు’ అని సూచించారు. బీసీలను టీడీపీకి దూరం చేయడానికి జగన్ పత్రిక ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ఢిల్లీ వెళతారని, లోపలకు వెళ్ళి తలుపేసుకుంటారని.. ‘జగన్ లోపలకు వెళ్లి ఏం చేస్తావు.. కాళ్లు నొక్కుతావా..’ అని అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-07-19T16:09:40+05:30 IST