Delhi Test: ముగిసిన తొలి రోజు ఆట.. భారత్ స్కోరు ఎంతంటే?
ABN , First Publish Date - 2023-02-17T17:21:38+05:30 IST
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య

న్యూఢిల్లీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 13, కేఎల్ రాహుల్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు తోకముడిచారు. ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్ చేరారు.
టీమిండియా బౌలర్లు మహమ్మద్ షమీ(Mohammed Shami), రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin), రవీంద్ర జడేజా(Ravindra Jadeja)లు పోటీపడి వికెట్లు తీయడంతో ఆసీస్ ఆటగాళ్లు బ్యాట్లు ఎత్తేశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కమిన్స్ సేనకు 50 పరుగుల వద్ద తొలి దెబ్బ తగిలింది. 15 పరుగులు చేసిన ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner)ను షమీ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత 91 పరుగుల వద్ద మార్నస్ లబుషేన్(18), స్టీవ్ స్మిత్(0) వికెట్లను కోల్పోయింది. వీరిద్దరినీ అశ్విన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత కాసేపటికే ట్రావిస్ హెడ్ (12) షమీ చేతికి చిక్కాడు.
108 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఉస్మాన్ ఖావాజా, పీటర్ హ్యాండ్స్కోంబ్ ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి భారత బౌలర్లను ఎదురొడ్డుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 81 పరుగులు చేసి సెంచరీకి చేరువవుతున్న ఖావాజాను రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. అనంతరం మరోమారు ఆసీస్ వికెట్లు పేకమేడలా కుప్పకూలాయి. హ్యాండ్స్కోంబ్ చివరి వరకు నిలిచి 72 పరుగులు చేశాడు. కెప్టెన్ కమిన్స్ 33 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో షమీకి 4 వికెట్లు దక్కగా, అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.