Hyderabad Metro: పాతబస్తీ మార్గంలో ఎన్నో అడ్డంకులు.. హెచ్‌ఎంఆర్‌ డ్రోన్‌ సర్వేలో ఏం తేలిందంటే..

ABN , First Publish Date - 2023-08-28T19:10:14+05:30 IST

పాతబస్తీకి మెట్రో నిర్మాణం అధికారులకు సవాలుగా మారింది. 5.5 కిలోమీటర్ల మార్గంలో 103 వరకు మతపరమైన మందిరాలు, సున్నితమైన నిర్మాణాలు అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. అన్ని వర్గాల సహకారం ఉంటేనే ఇక్కడ పనులను త్వరితగతిన పూర్తి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Hyderabad Metro: పాతబస్తీ మార్గంలో ఎన్నో అడ్డంకులు.. హెచ్‌ఎంఆర్‌ డ్రోన్‌ సర్వేలో ఏం తేలిందంటే..

పాతబస్తీకి మెట్రో నిర్మాణం అధికారులకు సవాలుగా మారింది. 5.5 కిలోమీటర్ల మార్గంలో 103 వరకు మతపరమైన మందిరాలు, సున్నితమైన నిర్మాణాలు అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. అన్ని వర్గాల సహకారం ఉంటేనే ఇక్కడ పనులను త్వరితగతిన పూర్తి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): పాతబస్తీ మెట్రో నిర్మాణం కోసం ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే, భూసామర్థ్య పరీక్షలకు టెండర్లను పిలిచిన హెచ్‌ఎంఆర్‌ ఆదివారం డ్రోన్‌ సర్వే చేపట్టింది. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు దాదాపు మూడు గంటల పాటు అధ్యయనం చేసింది. సంప్రదాయక సర్వేతో పాటు దారుల్‌షిపా జంక్షన్‌ నుంచి శాలిబండ మధ్య ఇరుకైన మార్గంలో రహదారి విస్తరణ, మెట్రో స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన ప్రభావిత ఆస్తుల కచ్చితమైన కొలతలను డ్రోన్‌ ద్వారా అధికారులు సేకరించారు. కొన్ని ఆటంకాలను గుర్తించారు.


అప్రమత్తంగా ఉంటేనే..

ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మొత్తం ఆరు స్టేషన్లు ఉండనున్నాయి. ఎంజీబీఎస్‌ స్టేషన్‌ దాటిన తర్వాత సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, శంషేర్‌గంజ్‌, జంగంమెట్‌, ఫలక్‌నుమా స్టేషన్ల వరకు పూర్తి చేయనున్న 5.5 కిలోమీటర్ల పనుల్లో భాగంగా 21 మసీదులు, 12 హిందూ దేవాలయాలు, 12 అషూర్‌ఖానాలు, 33 దర్గాలు, 7 సమాధియార్డులు, 6 చిల్లాలతోపాటు చిన్నా చితక కలిపి మొత్తంగా 103 మతపరమైన, సున్నితమైన నిర్మాణాలు అడ్డుగా ఉన్నాయి. వీటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఈ మేరకు డ్రోన్‌ సర్వే చేపట్టినట్లు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. డ్రోన్‌ సర్వే ద్వారా రియల్‌ టైమ్‌ డేటా, హై రెజుల్యూషన్‌ ఇమేజరీ త్రీ డీ మోడలింగ్‌, జియోగ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జీఐఎస్‌) డేటా, సీఏడీ సాఫ్ట్‌వేర్‌ ఏకీకరణ, డేటా విశ్లేషణ, విజువలైజేషన్‌ త్వరితగతిన సేకరించవచ్చని చెప్పారు. భూసామర్థ్య పరీక్షలకు టెండర్ల గడువు ముగిసిన తరుణంలో మరో వారం, పదిరోజుల్లో క్షేత్రస్థాయిలో పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌ వద్ద స్టేషన్లు..

నగర పర్యాటకంలో ప్రఖ్యాతిగాంచిన సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌ ప్రాంతాల నుంచి కూడా మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఇందులో భాగంగా చారిత్రక స్థలాల సమీపంలోని 500 మీటర్ల దూరంలో స్టేషన్లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. తద్వారా నగరంతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు మెట్రోను సద్వినియోగం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 5.5 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేయాలంటే ప్రస్తుత అంచనాల మేరకు ఒక్కో పిల్లర్‌ నిర్మాణానికి రూ.250 కోట్ల వరకు ఖర్చవుతోంది. వంద మీటర్లకు ఒక పిల్లర్‌తోపాటు వయాడక్టులు, స్టేషన్ల కోసం మొత్తంగా రూ.1800 కోట్ల నుంచి రూ.2000 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది.

Updated Date - 2023-08-28T19:10:18+05:30 IST