పాత గుట్టలో ఉత్సవ సంబరం
ABN , First Publish Date - 2023-02-02T00:14:02+05:30 IST
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పాత గుట్ట లక్ష్మీనరసింహుడి సన్నిధిలో బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం దేవతాహ్వానం, భేరీపూజ పర్వాలు సంప్రదాయ రీతిలో నిర్వహించారు. శ్రీవైష్ణవ దేవాలయాల్లో స్వామివారి బ్రహ్మోత్సవ తిరుకల్యాణ వేడుకలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడిని ఆవాహన జరిపే తంతు ధ్వజారోహణం పర్వం.
ఉదయం ధ్వజారోహణం..రాత్రికి దేవతాహ్వానం
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 1: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పాత గుట్ట లక్ష్మీనరసింహుడి సన్నిధిలో బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం దేవతాహ్వానం, భేరీపూజ పర్వాలు సంప్రదాయ రీతిలో నిర్వహించారు. శ్రీవైష్ణవ దేవాలయాల్లో స్వామివారి బ్రహ్మోత్సవ తిరుకల్యాణ వేడుకలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడిని ఆవాహన జరిపే తంతు ధ్వజారోహణం పర్వం. దేవతలను అర్చించి గరుత్మంతుడి చిత్రపటాన్ని శ్వేతధ్వజ పతాకంపై చిత్రించి ద్వజస్తంభంపైకి ఆరోహణ చేశారు. గరుత్మంతుడిని ఆహ్వానించడానికి గరుడ ముద్దలను ఎగురవేశారు. అంతకుముందు ఆలయ యాగశాలలో హవన పూజలు కొనసాగాయి. సాయంత్రం ప్రధానాలయంలో బ్రహ్మోత్సవాలకు అష్టదిక్పాలకులను ఆహ్వానించే భేరీపూజ, దేవతాహ్వాన పర్వాలు కొనసాగాయి. శుభకరమైన బ్రహ్మోత్సవ కార్యక్రమాలను కొనసాగించడానికి అనుగ్రహించాలని, ప్రజలందరినీ సంరక్షించాలని భగవంతుడిని వేడుకుంటూ సకల దేవతలు, లోక సంరక్షణకు అవతారమూర్తి నృసింహుని కల్యాణ వేడుకకు ఆహ్వానించే దేవతాహ్వాన వైదిక పర్వాలను సంప్రదాయరీతిలో నిర్వహించారు. ఈ విశేష వేడుకలను దేవస్థాన ప్రధానార్చకులు మరింగంటి మోహనాచార్యులు, అర్చకబృందం నిర్వహించగా, ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, ఇంచార్జి ఈవో రామకృష్ణ, పాల్గొన్నారు. గురువారం నుంచి అలంకార సేవత్సోవాలు కొనసాగనున్నాయి.
ఏకాదశి లక్షపుష్పార్చన
యాదగిరీశుడి సన్నిధిలో బుధవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని లక్షపుష్పార్చనలు, నిత్య పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో నిత్యారాధనలు చేసిన ఆచార్యులు రాత్రి వేళ మహానివేదన, శయనోత్సవ పర్వాలతో ఆలయ ద్వారబంధనం గావించారు. గర్భాలయంలో కొలువైన స్వయంభువులకు, ప్రతిష్టా అలంకారమూర్తులను వేదమంత్రాలతో నిజాభిషేకం, నిత్యార్చనలు నిర్వహించారు. ముఖమండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి అర్చకులు ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది లక్షపుష్పాలతో అర్చించారు.