Share News

PM Modi : సీఏఏని ఎవరూ తీసేయలేరు!

ABN , Publish Date - May 17 , 2024 | 05:05 AM

తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తీసేస్తామన్న విపక్ష ‘ఇండీ’ కూటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఆ చట్టాన్ని ఎవరూ తీసివేయలేరని, ఏం చేస్తారో చేసుకోండని ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు. గురువారం ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల్లో పలు చోట్ల ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.

PM Modi : సీఏఏని ఎవరూ తీసేయలేరు!
PM Narendra Modi

ఏం చేస్తారో చేసుకోండి.. ‘ఇండీ’ కూటమికి ప్రధాని సవాల్‌

  • ఆ చట్టం అమలు మొదలైంది

  • శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేస్తున్నాం

  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు

  • లాక్కునేందుకు విపక్షాల కుట్ర

  • యూపీ ప్రచారంలో మోదీ ఫైర్‌

ఆజంగఢ్‌/జాన్‌పూర్‌, మే 16: తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తీసేస్తామన్న విపక్ష ‘ఇండీ’ కూటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఆ చట్టాన్ని ఎవరూ తీసివేయలేరని, ఏం చేస్తారో చేసుకోండని ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు. గురువారం ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల్లో పలు చోట్ల ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. బుధవారం 16 మంది శరణార్థులకు భారత పౌరసత్వం ప్రదానం చేయడాన్ని ప్రస్తావిస్తూ.. దేశంలో సీఏఏ అమలు మొదలైపోయిందన్నారు. విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.

‘పౌరసత్వం పొందిన శరణార్థులు హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు. దీర్ఘకాలంగా దేశంలో శరణార్థులుగా జీవిస్తున్నారు. మతప్రాతిపదికన జరిగిన దేశవిభజన బాధితులు వీరు. గద్దెనెక్కితే సీఏఏని తీసివేస్తామని ఇండీ కూటమి అంటోంది. కానీ ఎవరూ ఈ చట్టాన్ని తొలగించలేరు. వేల మంది కి పౌరసత్వం ఇవ్వబోతున్నాం’ అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ మోసకారి పార్టీ అని.. మతతత్వ జ్వాలల్లో దేశం తగులబడేలా చేసిందని ధ్వజమెత్తారు. జమ్మూకశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను కూడా తాము తీసివేశామన్నారు. శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి ఇటీవల జరిగిన పోలింగ్‌ సందర్భంగా.. ప్రజాస్వామ్య పండుగలో ప్రజలు సగర్వంగా పాల్గొన్నారని.. ఈ అధికరణను ఎవరూ పునరుద్ధరించలేరనడానికి ఇది నిదర్శనమని తెలిపారు.

సమాజ్‌వాదీ పార్టీ, దాని అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌పై ప్రధాని మండిపడ్డారు. గతంలో ఆజంగఢ్‌ను ఉగ్రవాద కేంద్రంగా తయారుచేశారని.. బాంబు పేలుళ్లకు పాల్పడినవారికి క్షమాభిక్ష పెట్టారని.. రాజకీయాల ముసుగులో స్లీపర్‌ సెల్స్‌ పనిచేశాయని.. ఈ కారణంగా దేశమంతటా ఉగ్రవాదం విస్తరించిందని ఆరోపించారు. ‘కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ వేర్వేరు పార్టీలైనా రెంటికీ ఒకే దుకాణం ఉంది. బుజ్జగింపు రాజకీయాలు, అబద్ధాలు, కుటుంబ వాదం, అవినీతిని అక్క డ అమ్ముతుంటారు.


ఈ ఎన్నికల్లో బుజ్జగింపుల ట్రిపుల్‌ డోస్‌తో ముందుకొచ్చారు. రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను లాక్కుని.. తమ ఓటుబ్యాంకుకు కట్టబెట్టాలనుకుంటున్నారు. అలాగే ఈ కూటమి మీ (ప్రజల) ఆస్తిలో సగం తీసుకుని తమ ఓటుబ్యాంకుకు ఇవ్వాలనుకుంటోంది. మైనారిటీలకు ప్రత్యేక బడ్జెట్‌ పెడతామంటోంది.

నేను బతికున్నంతవరకు ఇలాంటివి జరగనివ్వను. కాంగ్రెస్‌ వాళ్లు ఎక్స్‌రే మెషీన్‌ (కులగణన) తెచ్చారు. గత వారం రోజులుగా వారి ఎజెండాను బయటపెడుతున్నాను. ఆ మెషీన్‌పగిలిపోయినట్లే కనిపిస్తోంది’ అని అన్నారు. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మించుకున్నామని.. యావద్దేశంతో పాటు ప్రపంచంలోని ప్రతి భారతీయుడు ఇందుకు ఆనందిస్తున్నారని.. కానీ కుటుంబవాదులు మాత్రం దూషిస్తున్నారని విమర్శించారు. సమాజ్‌వాదీ యువరాజు (అఖిలేశ్‌), ఆయన బాబాయి రామాలయం పనికిమాలినదని అంటున్నారని, కాశీని కూడా ఎద్దేవా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచంలో భారత్‌ సత్తాను చాటే ప్రధానిని ఎన్నుకోవడానికి ప్రస్తుత ఎన్నికలు అవకాశమని మోదీ అన్నారు. ఐదేళ్లలో ఐదుగురిని ప్రధాన మంత్రులను చేయాలని ఇండీ కూటమి అనుకుంటోదని ఎద్దేవాచేశారు. జూన్‌ 4 తర్వాత ఈ కూటమి విచ్ఛిన్నమవుతుందని చెప్పారు. ఫలితాలు వచ్చాక ఢిల్లీ, లఖ్‌నవూ యువరాజులు (రాహుల్‌గాంధీ, అఖిలేశ్‌) వేసవి విహార యాత్రకు విదేశాలకు వెళ్తారని ఆయన అన్నారు.


  • హిందూ బడ్జెట్‌.. ముస్లిం బడ్జెట్‌!

మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు.. మైనారిటీలకు బడ్జెట్‌లో 15ు కేటాయించాలని కాంగ్రెస్‌ ప్రతిపాదించిందని మోదీ తెలిపారు. అప్పట్లో తాను గుజరాత్‌ సీఎంగా ఉన్నానని.. బీజేపీ దీనిని పూర్తిగా వ్యతిరేకించిందని, దాంతో వెనక్కి తగ్గారని చెప్పారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ ఆ ప్రతిపాదన తెస్తోందన్నారు. ‘కాంగ్రె్‌సను ఎన్నుకుంటే బడ్జెట్‌ను హిందూ బడ్జెట్‌, ముస్లిం బడ్జెట్‌గా విభజిస్తుంది. దీనిని నేను అనుమతించను. మతప్రాతిపదికన రిజర్వేషన్‌కూ అంగీకరించను. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కూడా దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు’ అని తెలిపారు. మోదీ వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఖండించారు. 2013లో ముస్లిం బడ్జెట్‌ తేవాలని కాంగ్రెస్‌ అనుకోలేదని.. ఇది పూర్తిగా తప్పని, ఈ వ్యాఖ్యలు దారుణమని, మోదీ ప్రసంగ రచయితలకు మతిభ్రమించినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. వాస్తవానికి 2013లో వ్యవసాయంపై ముఖ్యమంత్రులతో కమిటీ వేయాలని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ భావించారని.. ఆ తర్వాత మోదీ ప్రధాని అయ్యారని జైరాం తెలిపారు.

Updated Date - May 17 , 2024 | 06:54 AM