Share News

Kidnapping case: కిడ్నాపింగ్ కేసులో భవానీ రేవణ్ణకు సుప్రీంకోర్టు నోటీసు

ABN , Publish Date - Jul 10 , 2024 | 05:01 PM

మహిళను కిడ్నాప్ చేసిన కేసులో ప్రజల్వ్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు సుప్రీంకోర్టు బుధవారంనాడు నోటీసులు పంపింది. భవానీ రేవణ్ణకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని కర్ణాటక 'సిట్' సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

Kidnapping case: కిడ్నాపింగ్ కేసులో భవానీ రేవణ్ణకు సుప్రీంకోర్టు నోటీసు

న్యూఢిల్లీ: మహిళను కిడ్నాప్ చేసిన కేసులో ప్రజల్వ్ రేవణ్ణ (Prajwal Revanna) తల్లి భవానీ రేవణ్ణ (Bhavani Revanna)కు సుప్రీంకోర్టు బుధవారంనాడు నోటీసులు పంపింది. భవానీ రేవణ్ణ (Bhavani Revanna)కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని కర్ణాటక 'సిట్' సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసును రాజకీయం చేయవద్దని తొలుత ధర్మాసనం స్పష్టం చేసినప్పటికీ ఎట్టకేలకు సిట్ విజ్ఞప్తి మేరకు భవానీ రేవణ్ణకు నోటీసు జారీ చేసేందుకు అంగీకరించింది.


ఆసక్తికరంగా వాదనలు..

కేసు విచారణ సందర్భంగా కర్ణాటక సిట్ తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ, భవానీ రేవణ్ణకు ముందస్తు బెయిలుతో హైకోర్టు ఉపశమనం కలిగించడం దురదృష్టకరమని అన్నారు. దీనిపై జస్టిస్ కాంత్ వెంటనే స్పందిస్తూ, రాజకీయ కారణాలను పక్కనపెట్టి హైకోర్టు చెప్పిన కారణాలు చూడండని సూచించారు. నిందితురాలు మహిళ అని, 55 ఏళ్ల వయస్సు అని, అకృత్యాలకు పాల్పడినట్టు ఆమె కుమారుడిపై ఆరోపణలు ఉన్నాయని, అతను పరారై ఆ తర్వాత పట్టుబడ్డాడని అన్నారు. కొడుకు చేసిన నేరాలను ప్రోత్సహించడంలో తల్లి పాత్ర ఏమిటి? అందుకు సాక్ష్యాలున్నాయా? ఆమెకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం ఏముంది? ఆని జస్టిస్ కాంత్ ఒక దశలో ప్రశ్నించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద జ్యుడిషియల్ మెజిస్ట్రేట్‌ బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారని, బాధితురాలి నిర్బంధించడంలో భవానీ పాత్ర ప్రస్తావన ఇందులో ఉందని సిబల్ పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ కాంత్ తిరిగి స్పందిస్తూ, ఒక మహిళకు ఉన్న స్వేచ్ఛ అంశాన్నే తాము పరిశీలిస్తున్నామని, ఆమె దోషి అయినట్లయితే అంతిమంగా విచారణలో తేలుతుందని అన్నారు. సిబల్ తన వాదనను తిరిగి కొనసాగిస్తూ, మహిళ అనే కారణంగా ఆమెకు నేరంలో ప్రమేయం లేదనే అభిప్రాయానికి బెంచ్ రాకూడదని అన్నారు. వాదోపవాదనల అనంతరం ఎట్టకేలకు భవానీ రేవణ్ణకు నోటీసులు పంపేందుకు ధర్మాసనం అంగీకరించింది.

Delhi Excise policy case: ఈడీ కొత్త ఛార్జిషీటు.. 37వ నిందితుడిగా కేజ్రీవాల్


ఇదీ నేపథ్యం...

కిడ్నాప్ ఆరోపలను ఎదుర్కొంటున్న భవానీ రేవణ్ణకు హైకోర్టు గత నెలలో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కుటుంబ జీవితంలో మహిళల పాత్ర కీలకమని, అకారణంగా కస్టడీకి పంపకుండా మహిళా పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. విచారణకు భవాని రేవణ్ణ సహకరిచడం లేదనే వాదన కూడా సరికాదని, పోలీసులు వేసిన 85 ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారని కూడా జస్టిస్ దీక్షిత్ గుర్తుచేశారు. భవానీ రేవణ్ణకు ముందస్తు బెయిలు మంజురు చేస్తూ, ఇన్వెస్టిగేషన్ సమయంలో మినహాయిస్తే మైసూరు, హసన్ జిల్లాల్లోకి ఆమె అడుగుపెట్టరాదనే షరతు విధించారు.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 10 , 2024 | 05:01 PM