Share News

పస్తులుండి.. చందాలు పోగేసి..

ABN , Publish Date - Aug 10 , 2024 | 06:25 AM

అర్షద్‌ నదీమ్‌.. క్రీడా ప్రపంచంలో ఇప్పుడీ పేరు మారుమోగుతోంది. పారిస్‌ క్రీడల జావెలిన్‌ త్రో ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌, భారత హీరో నీరజ్‌ చోప్రాను వెనక్కినెట్టి ఒలింపిక్‌ చాంపియన్‌గా అవతరించాడు.

పస్తులుండి..  చందాలు పోగేసి..

పాక్‌ ఒలింపిక్‌ వీరుడి స్ఫూర్తిదాయక ప్రస్థానం

అర్షద్‌ నదీమ్‌.. క్రీడా ప్రపంచంలో ఇప్పుడీ పేరు మారుమోగుతోంది. పారిస్‌ క్రీడల జావెలిన్‌ త్రో ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌, భారత హీరో నీరజ్‌ చోప్రాను వెనక్కినెట్టి ఒలింపిక్‌ చాంపియన్‌గా అవతరించాడు. ఎవరూ ఊహించని విధంగా 92.97 మీటర్ల దూరంలో ఈటెను విసిరి ఒలింపిక్‌ రికార్డుతో పాటు స్వర్ణం సాధించాడు. తన దేశం పాకిస్థాన్‌కు విశ్వక్రీడల్లో తొలిసారి పసిడికాంతులు వెదజల్లి ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయాడు. ఇప్పుడతనికి విశ్వవ్యాప్తంగా ప్రశంసలతో పాటు అతని దేశంలో అనేకమంది పోటీలుపడుతూ రివార్డులు ప్రకటిస్తున్నారు. కానీ, ఈస్థాయికి వచ్చేందుకు నదీమ్‌ పడిన కష్టం అంతాఇంతా కాదు. ఒకప్పుడు తినడానికి తిండిలేక పస్తులుండి.. తన గ్రామస్థులు చందాలు వసూలు చేసి ఇచ్చిన డబ్బుతో శిక్షణకెళ్లి.. ఇలా ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లు ఎదుర్కొంటూ ఒలింపిక్‌ హీరోగా మారిన 27 ఏళ్ల నదీమ్‌ జీవితం స్ఫూర్తిదాయకం.

నదీమ్‌ పాకిస్థాన్‌ పంజాబ్‌ ఫ్రావిన్స్‌లోని ఖనేవాల్‌ అనే గ్రామంలో జన్మించాడు. ఏడుగురు సంతానంలో మూడోవాడు. తండ్రి భవన నిర్మాణ కార్మికుడు. ఆ నిరుపేద కుటుంబానికి తండ్రి సంపాదనే ఆధారం. దీంతో పూట గడవక నదీమ్‌ కుటుంబసభ్యులతో కలిసి తిండికి పస్తులుండిన సందర్భాలు అనేకం. ఏడాదిలో ఒక్క పండుగరోజు మాత్రమే మాంసం వండుకొని తినేవాళ్లు. ఇలా ఎన్నో కష్టాలు పడుతూనే తన లక్ష్యం ఆటల్లో రాణించడంపై నదీమ్‌ దృష్టి పెట్టేవాడు. పాఠశాల స్థాయిలో క్రికెట్‌, ఫుట్‌బాల్‌, అథ్లెటిక్స్‌లాంటి క్రీడల్లో సత్తా చాటాడు. జిల్లాస్థాయిలో క్రికెట్‌ కూడా ఆడాడు. ఒకరోజు అథ్లెటిక్స్‌లో జావెలిన్‌ను అద్భుతంగా త్రో చేయడం గమనించిన కోచ్‌ రషీద్‌ అహ్మద్‌ అతడిని ఆ క్రీడవైపు ప్రోత్సహించాడు. కానీ సరైన జావెలిన్‌ కొనేందుకు, నాణ్యమైన డైట్‌ తీసుకునేందుకు డబ్బులు లేకున్నా రషీద్‌ మాత్రం ప్రాక్టీస్‌ ఆపలేదు. ఈ క్రమంలో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, ఇంటర్‌బోర్డు మీట్‌, జాతీయస్థాయిలో అనేక పతకాలు సాధించాడు. ఈ సమయంలో ఇతర ప్రాంతాల్లో టోర్నీలకు వెళ్లేందుకు డబ్బులు లేకపోతే.. తమ గ్రామవాసులు, బంధువులు చందాలు పోగు చేసి సహాయం చేసే వారని నదీమ్‌ తండ్రి అష్రాఫ్‌ వెల్లడించాడు. ఎన్నో సందర్భాల్లో తమ ఊరివాళ్లు అండగా నిలిచారని, వాళ్ల మేలును ఎప్పటికీ మరిచిపోలేమని అతను చెప్పుకొచ్చాడు. ఆర్థిక పరిస్థితి కారణంగా పంజాబ్‌ యూనివర్సిటీలోని ఓ పురాతన జిమ్‌లో నదీమ్‌ ప్రాక్టీస్‌ చేసేవాడు. ఆ జిమ్‌లో ఏసీ ఉండేది కాదు, ఉక్కపోతను భరిస్తూనే అక్కడ తుప్పుపట్టిపోయిన ఎన్నోఏళ్ల నాటి పరికరాలతోనే శిక్షణ కొనసాగించేవాడని నదీమ్‌ కోచ్‌ తెలిపాడు.

టర్నింగ్‌ పాయింట్‌ ఇలా...

2015లో పూర్తిస్థాయిలో జావెలిన్‌ త్రోయర్‌గా మారిన నదీమ్‌ అంతర్జాతీయస్థాయిలో జావెలిన్‌ త్రోలో రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2016లో ప్రపంచ అథ్లెటిక్స్‌ నుంచి స్కాలర్‌షిప్‌ దక్కించుకున్నాడు. తద్వారా మారిష్‌సలో శిక్షణకు వెళ్లాడు. ఇదే అతనికి టర్నింగ్‌ పాయింట్‌. అక్కడ శిక్షణలో రాటుదేలిన నదీమ్‌ 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచి తన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ తర్వాత పలుమార్లు గాయాలు వేధించినా వాటిని అధిగమిస్తూ ముందుకుసాగాడు. 2022లో తొలిసారి 90 మీటర్ల దూరంలో ఈటెను విసిరి కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం గెలిచాడు. నిరుడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించాడు. ఇప్పుడిక ప్రతి క్రీడాకారుని స్వప్నమైన ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలిచి తన దేశానికే గర్వకారణమయ్యాడు.

పారిస్‌లో నేటి భారతం

గోల్ఫ్‌: మహిళల వ్యక్తిగత ఫైనల్‌: అదితి అశోక్‌, దీక్షా డాగర్‌ (మ. 12.30)

రెజ్లింగ్‌: మహిళల 76 కిలోల ప్రీక్వార్టర్‌ఫైనల్‌ : రీతికా హుడా గీ బెర్నాడెట్‌ (హంగేరి) (మ. 2.51)

Updated Date - Aug 10 , 2024 | 06:25 AM