Share News

Hyderabad: పదవుల బొనాంజా!

ABN , Publish Date - Aug 14 , 2024 | 04:45 AM

తెలంగాణ కాంగ్రె్‌సలో పదవుల భర్తీకి వేళయింది. దీనిపై అధిష్ఠానంతో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం (16న) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయి టీపీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపైన చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Hyderabad: పదవుల బొనాంజా!

  • ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్‌.. పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో చర్చ

  • సామాజిక సమీకరణలు చూసుకుని.. టీపీసీసీ చీఫ్‌,

  • కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్‌ నియామకం

  • 4 మంత్రిపదవులు, ఉప సభాపతి, చీఫ్‌వి్‌పపైనా నిర్ణయం

  • బీసీ కమిషన్‌ సహా పలు కార్పొరేషన్‌ పదవుల భర్తీకి చాన్స్‌

  • బీసీ కమిషన్‌ చైర్మన్‌గా వీహెచ్‌, నిరంజన్‌ పేర్ల పరిశీలన

  • రైతు, విద్యా కమిషన్లకు కోదండరెడ్డి, ఆకునూరి మురళి పేర్లు

  • 19 లేదా 20న పదవుల భర్తీపై ప్రకటనకు అవకాశం!

  • నేడు కాగ్నిజెంట్‌ కొత్త క్యాంపస్‌ షురూ

  • కోకాపేటలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌

  • దక్షిణ కొరియా నుంచి వచ్చిన అనంతరం కార్యక్రమానికి..

  • 10 లక్షల చదరపు అడుగుల్లో కార్యకలాపాలు

  • 15 వేల ఉద్యోగాలు.. హైదరాబాద్‌లో ఐదోది..

హైదరాబాద్‌, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): తెలంగాణ కాంగ్రె్‌సలో పదవుల భర్తీకి వేళయింది. దీనిపై అధిష్ఠానంతో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం (16న) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయి టీపీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపైన చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే బీసీ, రైతు, విద్యా కమిషన్లు సహా పలు కమిషన్లు, కార్పొరేషన్ల చైర్మన్‌ పోస్టుల భర్తీకి సంబంధించి అధిష్ఠానంతో ఆమోదముద్ర వేయించుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తం అన్నీ కలిపి 20 నుంచి 30 దాకా పదవుల భర్తీకి అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ చర్చల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

అనంతరం 19న లేదా 20వ తేదీన ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని.. లేదా పదిహేను రోజులలోపే ప్రకటించవచ్చని విశ్వసనీయ సమాచారం. ఈ పదవుల భర్తీలో సామాజికవర్గ సమీకరణలే ప్రముఖ పాత్ర పోషిస్తాయని అంటున్నారు. టీపీసీసీ చీఫ్‌ పోస్టుకు ప్రస్తుతం ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌, ఎస్టీల నుంచి ఎంపీ బలరాంనాయక్‌ పోటీ పడుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ రేసులో ఉన్నారు. తుదినిర్ణయం అధిష్ఠానానిదే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


టీపీసీసీ చీఫ్‌తో పాటు.. నాలుగు కార్యనిర్వాహక అధ్యక్ష పదవులనూ భర్తీ చేసేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఈ నాలుగు పోస్టుల్లో రెడ్డి, మైనారిటీ వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించనున్నారు.

Untitled-2 copy.jpg

బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాల్లో టీపీసీసీ చీఫ్‌ పోస్టు దక్కిన వర్గాన్ని మినహాయించి.. మిగిలిన వర్గాలకు చెందిన ఇద్దరికి కార్యనిర్వాహక అధ్యక్ష పదవులు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. టీపీసీసీ చీఫ్‌ రేసులో ప్రధానంగా ఉండి ఆ పోస్టు దక్కని వారికి కార్యనిర్వాహక అధ్యక్ష పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టీపీసీసీ కార్యవర్గంలో ప్రధానమైన మరో పదవి.. ప్రచార కమిటీ చైర్మన్‌. ఈ పదవికి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. పీసీసీ కార్యవర్గం నియామకాల్లో సామాజిక సమీకరణలనూ పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గ విస్తరణపైనా అధిష్ఠానం నిర్ణయాలు చేయనున్నట్లు తెలుస్తోంది.


1-2 మంత్రి పదవులు పెండింగ్‌లో!

మంత్రివర్గ విస్తరణలో భాగంగా మరో ఆరుగురిని తీసుకునే వెసులుబాటు ఉండగా.. ఈ దఫాలోనూ పూర్తిస్థాయి విస్తరణ జరిగే అవకాశం లేదని సమాచారం. ఒకటి లేదా రెండు మంత్రి పదవులను పెండింగ్‌లో పెట్టే చాన్స్‌ ఉందని తెలుస్తోంది. ఉమ్మడి జల్లాలవారీగా చూస్తే.. నల్లగొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూనాయక్‌, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వివేక్‌, గడ్డం వినోద్‌ మంత్రిపదవులకు పోటీ పడుతున్నారు.

అయితే వీరిలో సుదర్శన్‌ రెడ్డి, వాకిటి శ్రీహరి పేర్లు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీపీసీచీ్‌ఫగా ఎస్టీని నియమిస్తే బాలూనాయక్‌ను డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది. బీసీ, ఎస్సీ వర్గాల నుంచి టీపీసీసీ చీఫ్‌ను ఎంపిక చేస్తే.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు బాలూనాయక్‌ కూడా మంత్రి పదవి రేసులో ఉంటారని చెబుతున్నారు.

ఇక ఆదిలాబాద్‌లో వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్‌, గడ్డం వినోద్‌ పోటీ పడుతుండడం ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గంలో ఇప్పటికే ఈ రెండు సామాజిక వర్గాలకూ ప్రాతినిధ్యం ఉండడంతో ఎవరికి పదవి దక్కుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక.. మంత్రి పదవుల్లో ఒకటి మైనారిటీలకు కేటాయించడం సంప్రదాయంగా వస్తూ ఉంది. మైనారిటీల నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎవరూ లేనందున దాన్ని పెండింగ్‌లో పెట్టేందుకు ఆస్కారం ఉందంటున్నారు. సామాజిక వర్గ సమీకరణల్లో చిక్కుముడి వీడకుంటే మరో మంత్రి పదవినీ పెండింగ్‌లో పెట్టే చాన్స్‌ ఉందని చెబుతున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు డిప్యూటీ స్పీకర్‌, చీఫ్‌ విప్‌ పదవులు ఇస్తారని చెబుతున్నారు.


మున్నూరు కాపు నేతల పేర్లు..

బీసీ కమిషన్‌ చైర్మన్‌ పోస్టును మున్నూరుకాపు సామాజిక వర్గానికి కేటాయించే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ పోస్టు కీలకంగా మారింది. ఈ పదవికి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ సీనియర్‌ నాయకులు వి. హన్మంతరావు, గోపిశెట్టి నిరంజన్‌ పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే తన సేవలను పార్టీ కే వినియోగించుకోవాలని నిరంజన్‌ అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది.

అలాగే గతంలో పీసీసీ చీఫ్‌, ఎంపీ, రాష్ట్ర మంత్రి పదవులను నిర్వహించిన వి.హన్మంతరావు.. బీసీ కమిషన్‌ చైర్మన్‌ పదవిని స్వీకరిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక.. ప్రస్త్తుతం ఒక్కటిగా ఉన్న ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను విడదీసి రెండు కమిషన్లుగా చేయాలా.. ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగించాలా అన్నదానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టతకు రాకపోవడంతో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పోస్టుల భర్తీని పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాగా.. రైతు, విద్యా కమిషన్‌ చైర్మన్లుగా కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళిని నియమించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన.. చేరుతున్న ఎమ్మెల్యేలకు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులను ఇచ్చే ఆలోచన సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నారు. వీటిపైనా సీఎం ఢిల్లీ పర్యటనలో స్పష్టత రానున్నట్లు చెబుతున్నారు.

Updated Date - Aug 14 , 2024 | 08:25 AM