Share News

CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు..

ABN , Publish Date - Jul 13 , 2024 | 06:45 PM

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక "గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు"ను సెప్టెంబర్ 5, 6వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదిక కానున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ సమ్మిట్ లోగోను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి ఆయన ఆవిష్కరించారు.

CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు..

హైదరాబాద్: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక "గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు"ను సెప్టెంబర్ 5, 6వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదిక కానున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ సమ్మిట్ లోగోను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.."హైదరాబాద్ వేదికగా గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సదస్సు నిర్వహించటం గర్వంగా ఉంది. సాంకేతిక ఆవిష్కరణలతో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందంజలో ఉంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృత్రిమ మేథా రంగ నిపుణులు, ఐటీ ఆవిష్కర్తలందరినీ ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. ‘మేకింగ్ ఏఐ వర్క్ ఎవ్రీ వన్’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. ఏఐ సమాజానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో, ఎలా సాధికారత కల్పిస్తుందో అన్వేషించటమే లక్ష్యంగా సదస్సు జరుగుతుంది. దాదాపు రెండు వేల మంది ప్రతినిధులు కార్యక్రమానికి హాజరవుతారు" అని తెలిపారు.


ఏఐ పరిజ్ఞానంతో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, ప్రపంచం ఎదుట ఉన్న సవాళ్లను పరిష్కరించేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​బాబు చెప్పారు. అందుకు వీలుగా ఏఐ సామర్థ్యాలను అన్వేషించేందుకు ఈ సమ్మిట్ కీలక వేదికగా మారనుందని పేర్కొన్నారు. ఈ సదస్సు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ భవిష్యత్తు, కొత్త ప్రాజెక్టులకు నాంది పలికే అవకాశం ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి శీధర్ బాబు తెలిపారు.

Updated Date - Jul 13 , 2024 | 07:21 PM