Share News

Hyderabad: వైద్య విద్య కళాశాలల అధ్యాపకుల వేతనాల పెంపు?

ABN , Publish Date - Jun 09 , 2024 | 03:46 AM

గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల వేతనాలు త్వరలో పెరగనున్నాయి. వారి మూల వేతనంపై 50ు వేతనం పెంచాలని రాష్ట్ర సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Hyderabad: వైద్య విద్య కళాశాలల అధ్యాపకుల వేతనాల పెంపు?

  • గిరిజన ప్రాంత అధ్యాపకులకు 50ు

  • మైదాన ప్రాంతాల్లో 30ు పెరుగుదల

  • త్వరలో విడుదలకానున్న జీవో

హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల వేతనాలు త్వరలో పెరగనున్నాయి. వారి మూల వేతనంపై 50ు వేతనం పెంచాలని రాష్ట్ర సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే మైదాన ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలల అధ్యాపకులకు వారి మూల వేతనంపై 30ు మేరకు వేతనం పెరగనుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను వైద్యవిద్య సంచాలకులు ప్రభుత్వానికి పంపారు. సంబంధిత ఫైలుకు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే వైద్య ఆరోగ్యశాఖ జీవో జారీ చేయనుంది. సంబంధిత జీవో వారం పది రోజుల్లోపే వచ్చే అవకాశం ఉందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వైద్య విద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు మూల వేతనంపై 50ు వేతనాలు పెంచారు. అదేవిధంగా తెలంగాణలోనూ వేతనాలు పెంచనున్నారు. దీంతో అధ్యాపకులకు వేతనాలు భారీగా పెరగనున్నాయి.


ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు మూల వేతనంపై కేవలం 9శాతమే హెచ్‌ఆర్‌ఏ ఇస్తున్నారు. ఉదాహరణకు మూల వేతనం రూ.68,900 ఉన్న ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆసిఫాబాద్‌లో పనిచేస్తే ఆయనకు కేవలం 9ు (రూ.6200) హెచ్‌ఆర్‌ఏ వస్తుంది. ఇదే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హైదరాబాద్‌లో పనిచేస్తే 30ు హెచ్‌ఆర్‌ఏ (రూ.20,670) ఇస్తారు. పైగా హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేటు ప్రాక్టీస్‌ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అదే అసిఫాబాద్‌లో పనిచేసే వారికి హెచ్‌ఆర్‌ఏ తక్కువగా రావడంతో పాటు అక్కడ నివసించేందుకు కనీస వసతులూ ఉండవు. పైగా పిల్లల్చి చదివించేందుకు సరైన పాఠశాలలు కూడా లేని పరిస్థితి ఉంటుంది. అలాగే ప్రైవేటు ప్రాక్టీసూ ఉండదు. ఈ కారణాలతోనే గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోని వైద్య విద్య కళాశాలల్లో పనిచేసేందుకు అధ్యాపకులు ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం లాంటి నగరాలు, పట్టణాలను మినహాయిస్తే మిగిలినచోట పనిచేందుకు అధ్యాపకులు ముందుకు రావడం లేదు. దాంతో గిరిజన, గ్రామీణ ప్రాంత మెడికల్‌ కాలేజీల్లో 50ు మేర అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అధ్యాపకులను ప్రోత్సహించడానికి వేతనాలు పెంచే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది.


వేతనాలు పెరిగితే ఇలా..

ప్రస్తుతం వైద్య విద్య కళాశాలలో పనిచేసే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు మూల వేతనం రూ.68,900 ఉంది. అసోసియేట్‌కు రూ.79,800, మూడేళ్లు అసోసియేట్‌గా పూర్తిచేస్తే వారికి రూ. 1,34,400 వేతనం ఉంది. ఇక ప్రొఫెసర్‌కు మూల వేతనం రూ.1,44,000 ఉంది. వీటికి అదనంగా 50ు వేతనం పెరగనుంది. అంటే గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,03,350 అవుతుంది. దీనిపై 9ు హెచ్‌ఆర్‌ఎ వస్తుంది. అలాగే అసోసియేట్‌కు రూ. 1,19700, మూడేళ్ల పూర్తి చేసుకున్న అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.2,01,600, ప్రొఫెసర్‌కు రూ.2,16000 వరకు వేతనం పెరుగుతుంది. వీటికి అదనంగా 9ు హెచ్‌ఆర్‌ఏ వస్తుంది. ఈ స్థాయిలో వేతనాలు పెరిగితే గ్రామీణ ప్రాంతాల్లోని వైద్య విద్య కళాశాలల్లో పనిచేసేందుకు అధ్యాపకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారని నాగర్‌ కర్నూల్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ నరహరి తెలిపారు.


ప్రస్తుతం అందరూ హైదరాబాద్‌కు పోస్టింగ్‌ కావాలని అడుగుతున్నారని, అదే గ్రామీణ ప్రాంత అధ్యాపకుల వేతనాలు పెంచితే నగర పోస్టులకు అంత డిమాండ్‌ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని వైద్య విద్య కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో ప్రొఫెసర్లను తీసుకున్నారు. ఇప్పుడు వేతనాలు పెంచి, రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తే.. రిక్రూట్‌మెంట్‌కు భారీగా డిమాండ్‌ ఉంటుందని మరో ప్రభుత్వ కాలేజీకి చెందిన అధ్యాపకుడు అభిప్రాయపడ్డారు. అంతేకాక అధ్యాపకుల కొరత కూడా తీరుతుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 03:46 AM