Tuni Municipality : టీడీపీలోకి మరో ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు
ABN , Publish Date - Feb 16 , 2025 | 05:14 AM
కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లు వరుసగా టీడీపీలోకి చేరుతున్నారు.

యనమల సమక్షంలో ఇప్పటిదాకా పది మంది చేరిక
తుని రూరల్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లు వరుసగా టీడీపీలోకి చేరుతున్నారు. ఇప్పటికే నలుగురు వైసీపీ కౌన్సిలర్లు సైకిల్ ఎక్కగా, తాజాగా మరో ఆరుగురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం వీరు తేటగుంట టీడీపీ క్యాంప్ కార్యాలయంలో టీడీపీలోకి చేరగా, వీరికి మాజీ మంత్రి, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో 12వ వార్డు కౌన్సిలర్ బి.వెంకటదారేష్, 19వార్డు ఆచంట సురేష్, 24వ వార్డు కౌన్సిలర్ పులి సత్యనారాయణ, 29 వార్డు కౌన్సిలర్ దాశపర్తి రాజేశ్వరి, 30వ వార్డు కౌన్సిలర్ సిద్దిరెడ్డి గౌరీ వనజ, 20వ వార్డు కౌన్సిలర్ రాసబోయిన అప్పయ్యమ్మ ఉన్నారు. ఇంతకుముందు 23వ వార్డు కౌన్సిలర్ కర్రి శ్రీదేవి, 28వ వార్డు కౌన్సిలర్ చింతకాయల భారతి, 4వ వార్డు కౌన్సిలర్ తుమ్మలపల్లి సుశీల, 8వ వార్డు కౌన్సిలర్ నార్ల భువనేశ్వరి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత రాజా అశోక్బాబు, తుని పట్టణ టీడీపీ అధ్యక్షుడు యినుగంటి సత్యనారాయణ, నాయకులు మోతుకూరి వెంకటేష్, కుక్కడపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. కాగా తుని మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులనూ వైసీపీ గెలుచుకోగా, వారిలో ఒకరు మరణించారు. మిగిలిన 29 మందిలో పది మంది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు.