Pakistan Afghan Expulsion: 30 లక్షల మంది అఫ్గాన్లను బహిష్కరించనున్న పాక్
ABN , Publish Date - Apr 01 , 2025 | 04:48 AM
పాకిస్తాన్ 30 లక్షల అఫ్గాన్లను బహిష్కరించనున్నట్లు ప్రకటించింది. దీనిపై తాలిబాన్ సర్కార్ గౌరవప్రదంగా పంపించడాన్ని కోరుతూ పాక్ కు విజ్ఞప్తి చేసింది

గౌరవప్రదంగా తిప్పి పంపాలని తాలిబాన్ సర్కార్ డిమాండ్
పెషావర్, మార్చి 31: తాలిబాన్లు అధికారంలోకి రావడాన్ని అంగీకరించక పొరుగుదేశమైన పాకిస్థాన్కు వలసవచ్చిన అఫ్గానిస్థాన్ వాసులకు కష్టకాలం ఎదురయింది. వారిని తమ దేశం నుంచి బహిష్కరించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటున్న దాదాపు 30 లక్షల మంది అఫ్గాన్లను బలవంతంగా తిప్పిపంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్వస్థలాలకు స్వచ్ఛందంగా వెళ్లిపోయేందుకు ఇచ్చిన గడువు సోమవారం ముగియడంతో అరెస్టులు, బలవంతంగా పంపివేయడం వంటి చర్యలకు దిగనుంది. రంజాన్ సెలవులు ముగిసిన వెంటనే ఏప్రిల్ పదో తేదీ నుంచి కార్యాచరణ చేపట్టనుంది. ఈ చర్యను ఐక్యరాజ్యసమితితో పాటు, మానవ హక్కుల సంఘాలు, అఫ్గాన్లోని తాలిబన్ ప్రభుత్వం ఖండించాయు. 2021లో అఫ్గానిస్థాన్ను తాలిబాన్లు చేజిక్కించుకోవడంతో లక్షలాదిమంది పాకిస్థాన్ వచ్చి ఆశ్రయం పొందారు. ఇది స్థానికులకు ఇబ్బందికరంగా మారడంతో వారిని తిప్పిపంపించి వేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమంగా ఉంటున్న విదేశీయులను బహిష్కరిస్తామంటూ 2023 అక్టోబరు నుంచి కార్యాచరణ ప్రారంభించింది. గత 18 నెలల్లో 8.45 లక్షల మంది అఫ్గాన్లు తిరిగి వెళ్లిపోయారని ఇంటర్నేషనల్ ఆర్గజైషన్ ఫర్ మైగ్రేషన్ షో అనే సంస్థ తెలిపింది. ఇంకా 30 లక్షల మంది ఉన్నారని పాక్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, అఫ్గాన్లను బహిష్కరించాలని పాకిస్థాన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొందని తాలిబన్ సర్కారు విమర్శించింది. ‘‘పరస్పర అంగీకారంతో ఒక వ్యవస్థ ద్వారా శరణార్థులను గౌరవప్రదంగా పంపంచాలని పాకిస్థాన్ను కోరాం’’ అని శరణార్థుల శాఖ అధికార ప్రతినిధి ముతాలిబ్ హక్కానీ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
ప్రత్యేక విమానంలో ముంబైకి కొడాలి నాని.. కారణమిదే