కులం కట్టుబాట్లే హత్య చేయించాయి
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:02 AM
కులం కట్టుబాట్లు పరువు హత్యకు పురిగొలిపాయని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ముత్యంరావు అన్నారు. శనివారం ముప్పిరితోటలో ఇటీవల పరువు హత్యకు గురై మృతిచెందిన పురేళ్ల సాయికుమార్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. హత్యకు దారితీసిన పరిస్థితులను మృతుడి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.

ఎలిగేడు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): కులం కట్టుబాట్లు పరువు హత్యకు పురిగొలిపాయని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ముత్యంరావు అన్నారు. శనివారం ముప్పిరితోటలో ఇటీవల పరువు హత్యకు గురై మృతిచెందిన పురేళ్ల సాయికుమార్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. హత్యకు దారితీసిన పరిస్థితులను మృతుడి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కులం, కట్టుబాట్లు, మూఢత్వం పేరుతో సాయికుమార్ను హత్య చేశారని, ప్రేమించుకున్న పాపానికి అత్యంత దారుణంగా హత్య చేయడం క్షమించరాని నేరమన్నారు.
ఇలాంటి సంఘటనతో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాలని, మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, అందుకు ఫాస్ట్ ట్రాక్కోర్టు ఏర్పాటుచేసి విచారణ త్వరితగతిన పూర్తిచే యాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు అశోక్, నాయకులు మోదంపల్లి శ్రావణ్, జిల్లాల ప్రశాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.