వెళ్లిపోనివ్వండి.. ప్లీజ్!
ABN , First Publish Date - 2023-05-25T01:14:18+05:30 IST
అమ్మ బాబోయ్... అయ్య బాబోయ్.. ఎందుకొచ్చాంరా బాబూ.. అంటూ జనం ఆపసోపాలు పడ్డారు. మండే ఎండలో నీడలేక అల్లాడిపోయారు.

సీఎం సభకు వేలాదిగా జనం
బస్సుల్లో తరలించిన నాయకులు
మండే ఎండలో ఆపసోపాలు
తాగడానికి నీళ్లు లేవు
సేదతీరడానికి ఫ్యాన్లు లేవు
నిర్వహణపై మండిపడిన జనం
సభ ఆరంభం నుంచే బయటకు..
50 నిమిషాల ఆలస్యంగా సభ
కొవ్వూరు/దేవరపల్లి/గోపాలపురం/తాళ్లపూడి/ నిడదవోలు/రాజమహేంద్రవరం సిటీ/ రూరల్, మే 24 : అమ్మ బాబోయ్... అయ్య బాబోయ్.. ఎందుకొచ్చాంరా బాబూ.. అంటూ జనం ఆపసోపాలు పడ్డారు. మండే ఎండలో నీడలేక అల్లాడిపోయారు.అక్కడక్కడా కనిపిం చిన చెట్ల నీడనే సేదతీరారు. కనీసం తాగడానికి కూడా మంచినీళ్లు లేక అలమటించారు. అప్పటికప్పుడు వ్యాన్ లో మజ్జిగ ప్యాకెట్లు తెచ్చి గాలిలో విసరడం ప్రజలను విస్మయానికి గురిచేసింది. జనం తరలింపునకు తగినట్టు ఏర్పాట్లు చేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గుర య్యారు. మధ్యలోనే మహిళలు, విద్యార్థులు వెనుదిరిగారు. కొవ్వూరు సత్యవతినగర్లోని హోం మంత్రి క్యాం పు కార్యాలయం ఎదురుగా బుధవారం విద్యాదీవెన కార్యక్రమాన్ని బటన్ నొక్కి సీఎం జగన్మోహనరెడ్డి ప్రారంభించారు.ఉదయం 8-30 నుంచి 9 గంటల మధ్యలో వచ్చిన కార్యకర్తలు, విద్యార్థులను సభా ప్రాంగణంలోకి రానిచ్చారు.ఆ తరువాత వచ్చిన వారిని లోపలికి అనుమతించకపోవడంతో చాలా మంది ఎండలోనే ఉండిపోయారు. భానుడు ఉగ్రరూపంతో అందరూ విలవిల్లాడిపోయారు. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే వెనుదిరిగారు.పూర్తిస్థాయిలో త్రాగునీరు,ఫ్యాన్లు ఏర్పాటుచేయకపోవడంతో ఒక పక్క ఉక్కబోత,మరో పక్క దా హంతో అల్లాడారు. సభ ప్రారంభ సమయంలో ముందుగా హోంమంత్రి వనిత మాట్లాడుతుండగానే కార్యకర్తలు సభా ప్రాంగణం నుంచి బయటకు రావడం ఆరం భించారు. సీఎం జగన్మోహనరెడ్డి మాట్లాడుతుండగానే విద్యార్థులు, కార్యకర్తలు గ్యాలరీల మధ్యలో దూరి బయటకు వచ్చేశారు.పోలీసులు అడ్డుకోవాలని ప్రయ త్నిం చినా ఆగలేదు.పోలీసులు మాత్రం పదే పదే బారికేడ్లను నిలబెట్టడం కనిపించింది. ఉదయం సభా ప్రాంగణం వరకూ తీసుకొచ్చి వదిలేశారు. సభ ముగిసిన తరువాత బస్సులపై వచ్చిన జనం ఏ బస్సు ఎక్కడ ఉందో తెలియక తికమక పడ్డారు. పలువురు బయటకు వచ్చి కొవ్వూరు గామన్ బ్రిడ్జి టోల్ గేట్ వద్దకు చేరుకుని అక్కడ నుంచి ఆటోలలో ఇళ్లకు వెళ్లిపోవడం కనిపించింది.గోపాలపురం మండలం నందమూరి గ్రామం నుంచి ఒకే ఆటోలో దపదపాలుగా 50 మందిని తర లించి వారికి 20 భోజనం ప్యాకెట్లను ఇచ్చి సర్దుబాటు చేసుకోండి అని నాయకులు చెప్పడాన్ని తప్పుపట్టారు. కొన్ని గ్రామాల నుంచి మహిళలే వంట తయారు చేసుకుని వంట పాత్రలతో వచ్చారు. రోడ్ షో కోసం తీసుకువచ్చిన డ్వాక్రా, మెప్మా, వెలుగు, సచివాలయ సిబ్బందిని ఉదయం నుంచి రోడ్డు పక్కగా సీఎం వచ్చి వెళ్లే వరకు ఎండలో నిలబెట్టడంతో మహిళలు నీరసిం చిపోయారు. కొవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జి, ధవళేశ్వరం బ్యారేజ్పై ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించి నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, జంగారెడ్డిగూడెం వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ను పంగిడి మీదుగా గామన్బ్రిడ్జిపై మళ్లించారు. దీంతో ప్రజలు, ఉద్యోగులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యా ర్థులకు సీఎం పర్యటన ఇక్కట్లు తప్పలేదు.ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగాయి.పోలీసులు పట్టణంలోని బస్టాండ్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం, టాక్సీస్టాండ్, నందమూరు రోడ్ బుద్ధుడి బొమ్మ వద్ద, ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంతో పట్టణ ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. సీఎం సభ నేపథ్యంలో ఆటోవాలాలు రెచ్చిపోయారు. ప్రయాణికులను దోచుకున్నారు.
50 నిమిషాలు ఆలస్యంగా సభ..
ఉదయం 9.20 గంటలకు కొవ్వూరు చేరుకోవాల్సిన సీఎం 50 నిమిషాల ఆలస్యంగా 10-10 గంటలకు వచ్చా రు. పట్టణంలోని నందమూరు రోడ్ కేజీఎం పాఠశాల ఎదురుగా ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ నుంచి రోడ్ షో సాగింది. అయితే సీఎం కనీసం బస్ అద్దం తీయలేదు.. లోపల నుంచే అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దీంతో తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్ వెళ్లిన వెంటనే ఎవ్వరికి వారు ఇంటిదారి పట్టారు. సీఎం షెడ్యూల్కు 50 నిమిషాల ఆలస్యంగా కార్యక్రమం ప్రారంభమైంది.ఉదయం 9.45 గంటలకు ప్రారం భం కావాల్సిన సభ ఆలస్యంగా 11 గంటలకు ప్రాంభమై 12.30 గంటలకు ముగిసింది.
కొవ్వూరు సమస్యలన్నీ పరిష్కరిస్తా : సీఎం
కొవ్వూరు, మే 24 : కొవ్వూరు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయిస్తున్నట్టు సీఎం జగన్మోహనరెడ్డి ప్రకటించారు.కొవ్వూరులో జరిగిన విద్యాదీవెన కార్యక్రమాన్ని బుధవారం బటన్ నొక్కి ప్రారంభించారు. 2023 విద్యా సంవత్సరంలో జనవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి 9.95 లక్షల మంది విద్యార్థు లకు లబ్ది చేకూరుస్తూ రూ.703 కోట్లు జమ చేశారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కొవ్వూరు పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత భవన నిర్మాణాలకు నిధులు కేటాయించాలని కోరారు. నియోజకవర్గంలో ఉన్న కుమారదేవం, పైడిమెట్ట, బ్రాహ్మణగూడెం, చాగల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల్లో పం పులు, మోటార్లు మరమ్మతులు చేపట్టడానికి నిధులు మంజూరు చేయాలని, మూడు మండలాల్లో 3 అంబే డ్కర్ భవనాలు, కొవ్వూరు పట్టణంలో కాపు కళ్యాణ మండపం, ఎస్సీ కమ్యూనిటీ హాలు, మైనార్టీలకు షాదీఖానా మంజూరు చేయాలని కోరారు. తాళ్లపూడి మం డలం తిరుగుడుమెట్ట పరిసర ప్రాంతాల్లో కొవ్వాడ కెనాల్పై కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి.. నిధులు మంజూరు చేస్తున్నట్టు సభాముఖంగా ప్రకటించారు. జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ విద్యా దీవెన కింద జిల్లాలో 33 వేల మంది విద్యార్థులకు సంబంధించి 23 వేల మంది తల్లుల ఖాతాల్లో రూ. 23.25 కోట్లు జమచేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు ఎస్.రాజీవ్కృష్ణ, ఎంపీ మా ర్గాని భరత్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, జి. శ్రీనివాసనాయుడు,తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, పోసిన శ్రీలేఖ, జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్భరత్, మునిసిపల్ చైర్పర్సన్ బావన రత్నకుమారి, వైస్చైర్మన్లు మన్నె పద్మ, గండ్రోతు అంజలీదేవి, కమిషనర్లు కె. దినేష్కుమార్, బి. శ్రీకాంత్, అసిస్టెంట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, ఆర్డీవోలు ఎస్.మల్లిబాబు, ఎ.చైత్రవర్షిణి పాల్గొన్నారు.
సీఎం సభకు రాకపోతే రూ.100 ఫైన్?
చాగల్లు, మే 24 : సీఎం జగన్ కొవ్వూరు సభను విజయవంతం చేయడానికి అధికారులు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మండలం నుంచి సుమారు 40 బస్సులు ఏర్పాటు చేయగా జనాలు అంతంత మాత్రంగానే బస్సుల్లో తరలివెళ్లడం జరిగింది. డ్వాక్రా మహిళలే లక్ష్యంగా మీటింగ్కు తప్పనిసరిగా రావాలని లేకపోతే రూ. వంద వంతను చెల్లించాలని ఆయా సంఘాల మహిళలకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల మహిళలు సభకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. సభకు వెళ్లి తిరిగొచ్చిన మహిళలు తాగునీరందక, భోజనం లేక నీరసంగా చేరారు.. బాబోయ్ సీఎం సభ అంటూ ఆపసోపాలు పడ్డారు.