JD Lakshminarayana: రాజకీయ భవిష్యత్తుపై జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ

ABN , First Publish Date - 2023-02-21T15:10:58+05:30 IST

తన రాజకీయ భవిష్యత్తుపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టతనిచ్చారు.

JD Lakshminarayana: రాజకీయ భవిష్యత్తుపై జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ

విశాఖపట్నం: తన రాజకీయ భవిష్యత్తుపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Former CBI JD Lakshminarayana) స్పష్టతనిచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ (MP)గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తన ఆలోచన విధానాన్ని ఇప్పటికే స్పష్టం చేశానన్నారు. ఏదైనా పార్టీ తన ఆలోచనా విధానం నచ్చి వస్తే వారితో చర్చలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మన ఎన్నికల వ్యవస్థలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.

అప్పట్లో జగన్ అక్రమాస్తుల కేసు విషయంలో సీబీఐ జేడీగా లక్ష్మీనారాయణ పేరు రాష్ట్రమంతా మార్మోగిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి ఎంతో దూకుడుగా ఉంటూ అనేక విషయాలను బయటపెడుతూ నిత్యం వార్తల్లో నిలిచారు. ఆపై వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆయన రాజకీయాల వైపు అడుగులేశారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పార్టీ విధానాలు నచ్చి జనసేన (Janasena)లో చేరారు. గత ఎన్నికల్లో జనసేన తరపున విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ...వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanaranaya) చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత పవన్ పార్టీకి గుడ్‌‌బై చెప్పి సామాజిక సేవ చేయడం, రైతులకు అండగా నిలవడమే లక్ష్యంగా ముందుకెళతానని ప్రకటించారు. కానీ మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయంగా అడుగువేయాలని దృష్టిసారించారు. అయితే ఈ సారి లక్ష్మీనారాయణ ఏ పార్టీ నుంచి బరిలోకి నిలుస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-02-21T15:10:59+05:30 IST