Congress : ఇందిర, సోనియా, రాహుల్ గాంధీల ప్రవర్తనపై గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-05T14:50:38+05:30 IST

కాంగ్రెస్ పార్టీతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని, ఆ పార్టీ పట్ల తనకు చెడు అభిప్రాయం లేదని డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ

Congress : ఇందిర, సోనియా, రాహుల్ గాంధీల ప్రవర్తనపై గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలు
Indira Gandhi, Sonia Gandhi , Rahul Gandhi

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని, ఆ పార్టీ పట్ల తనకు చెడు అభిప్రాయం లేదని డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ (Democratic Progressive Azad Party chief Ghulam Nabi Azad) చెప్పారు. అయితే మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ (Indira Gandhi) పనితీరుకు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యవహార శైలికి చాలా తేడా ఉందని విమర్శించారు. ఆ పార్టీ ప్రస్తుతం చాలా మార్పులకు గురైందన్నారు. ‘‘నియామకాల సంస్కృతి’’ పైచేయి సాధించిందన్నారు.

గులాం నబీ ఆజాద్ ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు నాయకత్వం వహించిన ఇందిరా గాంధీ, సోనియా గాంధీ (Sonia Gandhi) పనితీరులో తేడాల గురించి వివరించారు. పార్టీ వ్యవహార శైలిలో తీవ్రమైన మార్పులు వచ్చాయన్నారు. ‘‘నియామకాల సంస్కృతి’’ పెరిగిపోయిందన్నారు. ఇందిరా గాంధీ వ్యవహార శైలి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేదన్నారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా తాను పని చేసిన కాలంలో ఆమెతో చాలా సన్నిహితంగా వ్యవహరించినట్లు తెలిపారు. ఆ రోజుల్లో తాను ఆమెను ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవగలిగేవాడినని చెప్పారు. నేడు మాత్రం జూనియర్ లీడర్లకు అటువంటి అవకాశం ఉండటం లేదన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవడం గురించి ఇప్పుడు ఆలోచించడం కూడా సాధ్యం కాదన్నారు. అదంతా గత చరిత్ర అని చెప్పారు.

తాను కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఆ పార్టీ తనను ప్రమాదకారిగా భావిస్తోందన్నారు. తనను కాంగ్రెస్ వ్యతిరేకించినంతగా మరే ఇతర పార్టీ వ్యతిరేకించలేదన్నారు. ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పార్లమెంటులో తనను ప్రశంసించారని, అప్పుడు కాంగ్రెస్ సంతోషించడానికి బదులు తీవ్రంగా బాధపడిందని చెప్పారు. తనకు భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని ఇచ్చినపుడు కూడా కాంగ్రెస్ వ్యతిరేకించిందన్నారు.

తన పార్టీని బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్ విమర్శిస్తోందని, అదే విధంగా తాను కూడా ఆ పార్టీని విమర్శించగలనని చెప్పారు. కాంగ్రెస్ చేస్తున్నదేమీ లేదన్నారు. బీజేపీ స్వేచ్ఛగా ఎదగడానికి కాంగ్రెస్ అవకాశం కల్పిస్తోందన్నారు. తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోలేదన్నారు. జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతంలో శాసన సభ ఎన్నికలు జరగవలసి ఉన్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, గత కొన్ని ఎన్నికల్లో సొంతంగా ఆధిక్యతను సాధించిన ఏకైక పార్టీ ఏదీ లేదన్నారు. బీజేపీతో పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ చేతులు కలిపాయన్నారు.

ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గతంలో కాంగ్రెస్‌లో ఉండేవారని, ఆ పార్టీపై శర్మకుగల ఆగ్రహం గురించి తాను రాహుల్ గాంధీతో అప్పట్లో చెప్పానని గులాం నబీ ఆజాద్ తెలిపారు. అప్పుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ, ‘‘ఆయనను వెళ్లనివ్వండి’’ అన్నారని తెలిపారు.

శర్మ 2015లో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Supreme Court : మీడియా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Rahul Vs Scindia : రాహుల్ గాంధీపై జ్యోతిరాదిత్య సింథియా మండిపాటు

Updated Date - 2023-04-05T14:50:38+05:30 IST