Mysore Dussehra Festivals: గజ పయనం ప్రారంభం

ABN , First Publish Date - 2023-09-02T10:54:52+05:30 IST

ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాల్లో(Mysore Dussehra Festivals) పాల్గొనే ‘గజ పయనం’ ఘనంగా ప్రారంభమయ్యింది.

Mysore Dussehra Festivals: గజ పయనం ప్రారంభం

- పూజలు చేసి స్వాగతం పలికిన అధికారులు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాల్లో(Mysore Dussehra Festivals) పాల్గొనే ‘గజ పయనం’ ఘనంగా ప్రారంభమయ్యింది. శుక్రవారం ఉదయం 9.45 - 10.15గంటల మధ్య తులా లగ్నంలో గజరాజులకు పూలుచల్లి సాదరంగా ఆహ్వానించారు. తద్వారా 2023 దసరా ఉత్సవాల ఘట్టం ప్రారంభమైంది. నాగరహొళె జాతీయ ఉద్యానవనం ప్రధాన ద్వారా వీరనహొసహళ్ళి వద్ద అభిమన్యు నేతృత్వంలోని 8 గజరాజులను స్వాగతించారు. మహేంద్ర, అర్జున, వరలక్ష్మి, ధనుంజయ, గోపి, విజయ, పార్థసారథి, రోహితలు ఉన్నాయి. అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ఖండ్రె(Minister Ishwar Khandre), మైసూరు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి మహదేవప్పతోపాటు ఎమ్మెల్యేలు హరీశ్‌గౌడ, ఎమ్మెల్సీ మంజేగౌడ, జిల్లా అధికారి డాక్టర్‌ కేవీ రాజేంద్ర, మైసూరు నగర పోలీస్‌ కమిషనర్‌ రమేశ్‌ బానోత్‌, జిల్లా ఎస్పీ సీమా లా, జిల్లా అటవీశాఖ అధికారి సౌరబ్‌కుమార్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. సంప్రదాయ కళాబృందాలు కంసాలె, డొళ్ళుకుణిత, వీరగాసె, పూజాకుణిత, గొరవర కుణిత, గురుపురం టిబెటియన్‌స్కూల్‌ విద్యార్థులు, ఆదివాసీల చిన్నారుల ప్రత్యేక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మహదేవప్ప మాట్లాడుతూ దసరా ఉత్సవాలలో భాగంగా అభయారణ్యం నుంచి గజరాజులను ధార్మిక సంప్రదాయపద్ధతుల్లో స్వాగతించామన్నారు. ఈశ్వర్‌ఖండ్రె మాట్లాడుతూ గజరాజులు ఈనెల 5న మైసూరు ప్యాలె్‌సకు చేరుకుంటాయన్నారు.

Updated Date - 2023-09-02T10:54:52+05:30 IST