Share News

Tdp : నామినేటెడ్‌ నైరాశ్యం..!

ABN , Publish Date - Sep 25 , 2024 | 12:24 AM

నామినేటెడ్‌ పదవుల తొలి జాబితాలో జిల్లాకు ఒక చైర్మన, నాలుగు డైరెక్టర్‌ పదవులు మాత్రమే లభించాయి. మాజీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డికి సీడాప్‌ చైర్మనగా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ముఖ్య నేతలు నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. మూన్నెళ్లుగా పదవుల పంపకాల కోసం ఎదురు చూస్తున్నారు. వందరోజుల పాలన పూర్తి కావడంతో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఇదే ...

Tdp : నామినేటెడ్‌ నైరాశ్యం..!
Deepak Reddy

ఒక చైర్మన.. నలుగురు డైరెక్టర్లు

తొలి జాబితాలో జిల్లాకు ఇంతే..!

సీడాప్‌ చైర్మనగా మాజీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి

ఇక మలి జాబితాపైనే నాయకుల ఆశలు

అనంతపురం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): నామినేటెడ్‌ పదవుల తొలి జాబితాలో జిల్లాకు ఒక చైర్మన, నాలుగు డైరెక్టర్‌ పదవులు మాత్రమే లభించాయి. మాజీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డికి సీడాప్‌ చైర్మనగా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ముఖ్య నేతలు నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. మూన్నెళ్లుగా పదవుల పంపకాల కోసం ఎదురు చూస్తున్నారు. వందరోజుల పాలన పూర్తి కావడంతో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో నామినేటెడ్‌ పదవుల తొలి జాబితాను మంగళవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఇది ఆశావాహులను నిర్ఘాంతపోయేలా చేసింది. జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, కొన్ని స్థానాల్లో సార్వత్రిక ఎన్నికల్లో మాజీలు, నియోజకవర్గ ఇనచార్జిలకు పోటీచేసే అవకాశం దక్కలేదు. అలాంటి


వారికి రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవుల్లో చోటు కల్పిస్తారని భావించారు. టీడీపీ అధినాయకత్వం పలుమార్లు ఇదే విషయం చెప్పింది. దీంతో తొలి జాబితాలోనే అవకాశం దక్కుతుందని ఆశావహులు ధీమాగా ఉన్నారు. తొలి జాబితాలో రాష్ట్ర వ్యాప్తంగా 20 విభాగాల నామినేటెడ్‌ (చైర్మన) పోస్టులను ప్రకటించారు. అందులో జిల్లాకు కేవలం ఒక పదవి దక్కింది. మరో నాలుగు డైరెక్టర్‌ పోస్టులతో సరిపెట్టారు. మలి జాబితాలోనైనా ప్రాధాన్యం దక్కుతుందని ఆశావాహులు సర్దుకుంటున్నారు. తొలి జాబితా పార్టీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసిందని పార్టీ ముఖ్య, ద్వితీయశ్రేణి నాయకులు అంటున్నారు.

సీడాప్‌ చైర్మనగా దీపక్‌రెడ్డి

రాష్ట్ర ఉపాధి కల్పన, సమాజాభివృద్ధి (ఎస్‌ఈఈడీఏపీ) చైర్మనగా రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ గూనపాటి దీపక్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. 2021 శాసనమండలి ఎన్నికల్లో స్థానిక సంస్థల స్థానం నుంచి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2020లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై ఏర్పాటు చేసిన సెలెక్ట్‌ కమిటీలో దీపక్‌రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డికి దీపక్‌ రెడ్డి అల్లుడు. వైసీపీ పాలనలో జగన ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేశారు. ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపించారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, యువనేత నారా లోకేశకు సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి హోదాలో నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్రలో కీలకంగా పనిచేశారు. పాదయాత్ర ప్రారంభం నుంచి ముగిసేదాకా లోకేశ వెన్నంటే నడిచారు. పాదయాత్రలో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. నారా లోకేశ నుంచి ఆయన ప్రశంసలు అందుకున్నారు.

నలుగురు డైరెక్టర్లు

టీఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు పోతుల లక్ష్మీనరసింహులును డైరెక్టర్‌ పోస్టు వరించింది. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఆయనను పద్మశాలీ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన డైరెక్టర్‌గా నియమించారు. రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన పి.పురుషోత్తం కూడా ఇదే కార్పొరేషనలో డైరెక్టర్‌ పదవి దక్కించుకున్నారు. ఏపీ మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌గా గుంతకల్లు నియోజకవర్గ కేంద్రానికి చెందిన కేసీ హరిని నియమించారు. పార్టీ ఆవిర్భావం కేసీ హరి కుటుంబం పార్టీ కోసం పనిచేస్తోంది. వారి సేవలను గుర్తించే కేసీ హరికి మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌గా అవకాశం కల్పించారు. ఏపీ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ కో-ఆపరేటివ్‌ ఫైనాన్స కార్పొరేషన డైరెక్టర్‌గా కళ్యాణదుర్గానికి చెందిన వెంకటేశ్వర్లును నియమించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 25 , 2024 | 12:24 AM