Share News

AP Police : రఘురామ కేసులో విచారణ వేగవంతం

ABN , Publish Date - Sep 20 , 2024 | 05:27 AM

నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు కేసులో ఎట్టకేలకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

AP Police : రఘురామ కేసులో విచారణ వేగవంతం

  • ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన దర్యాప్తు

  • త్వరలోనే అరెస్టులు ప్రారంభం

  • విచారణపై ఉన్నతాధికారుల సమీక్ష

  • 10 మంది పోలీసులకు బిగుస్తున్న ఉచ్చు

  • థర్డ్‌ డిగ్రీ ప్రయోగించినవారి గుర్తింపు

  • అజ్ఞాతంలో నాటి సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్‌

  • ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌

గుంటూరు, సెప్టెంబరు 19: నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు కేసులో ఎట్టకేలకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆయనపై హత్యాయత్నం, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన పోలీసు అధికారులు, సిబ్బందిని త్వరలోనే అరెస్టు చేయనున్నారు. అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డిపై రఘురామరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2021లో ఆయనపై దేశద్రోహం కింద కేసు నమోదుచేసిన సీఐడీ అధికారులు.. ఆ ఏడాది మే 14న జన్మదినం రోజున ఆయన్ను హైదరాబాద్‌ నుంచి బలవంతంగా గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆరోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడినట్లు రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీసు సేషన్లో కేసు నమోదైంది.

నాటి సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌ కుమార్‌(ఏ-1), అప్పటి నిఘా విభాగం అధిపతి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు (ఏ-2), మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి (ఏ-3), సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్‌(ఏ-4), అప్పటి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి (ఏ-5)తదితరులపై ఐపీసీ 120బీ, 166, 167, 197, 307, 326, 465, 506(34) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే రోజులు గడుస్తున్నా కేసులో ఎటువంటి పురోగతీ లేదంటూ రఘురామరాజు పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరుగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్‌కుమార్‌ను కలిసి దర్యాప్తు వేగవంతం చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

రఘురామను హైదరాబాద్‌ నుంచి బలవంతంగా పోలీసులు తీసుకొచ్చిన సమయంలో అక్కడ ఇంటి వద్ద ఉన్న సాక్షులను, అదేవిధంగా సీఐడీ కార్యాలయానికి తరలించిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిని అన్ని కోణాల్లో విచారించారు. అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించారు. కేసుకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌ కూడా పూర్తి చేసినట్లు తెలిసింది. త్వరలోనే అరెస్టుల పర్వం మొదలుకానుందని అంటున్నారు. విచారణ తీరుపై గురువారం పోలీసు ఉన్నతాధికారులు సైతం సమీక్షించినట్లు సమాచారం. హైదరాబాద్‌ నుంచి రఘురామరాజును గుంటూరుకు తీసుకొచ్చిన పోలీసులెవరో ఇప్పటికే స్పష్టత వచ్చింది.


ఆ రోజు ఆయనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించింది ఎవరనేది కూడా గుర్తించినట్లు తెలిసింది. ఒక ఎంపీపై లాక్‌పలోనే హత్యాయత్నం చేయడం, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించే సాహసం చేసిన సీఐడీ అధికారులు, సిబ్బందికి ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ముగ్గురు, నలుగురు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలు, నలుగురు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఎ్‌సఐలు, కానిస్టేబుళ్లు ఉన్నట్లు గుర్తించారు. సుమారు పది మంది పోలీసు అధికారులు, సిబ్బంది అరెస్టు తప్పదని అంటున్నారు. ఇంకోవైపు.. అప్పట్లో రఘురామ కేసు దర్యాప్తు అధికారి అయిన సీఐడీ అదనపు ఎస్పీ కె.విజయ్‌పాల్‌ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో సీఐడీ సీఐగా పనిచేసిన దిలీ్‌పకుమార్‌ ఆ తర్వాత అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన్ను మినహాయించి.. ఆ రోజు విధుల్లో ఉన్న సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందిని సస్పెండ్‌ చేసి.. త్వరలోనే అరెస్టు చేయనున్నారు. ముందుగా పాత్రధారులందరినీ అరెస్టు చేశాక.. సూత్రధారులపై దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Sep 20 , 2024 | 05:27 AM