Share News

Duvvada Srinivas: దువ్వాడ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. దివ్వెల మాధురిపై కేసు నమోదు..

ABN , Publish Date - Aug 12 , 2024 | 11:41 AM

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా క్షణానికో మలుపు తిరుగుతోంది. తాజా అప్‌డేట్ ఏంటంటే.. దువ్వాడ‌తో సంబంధం పెట్టుకుందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Duvvada Srinivas: దువ్వాడ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. దివ్వెల మాధురిపై కేసు నమోదు..

శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా క్షణానికో మలుపు తిరుగుతోంది. తాజా అప్‌డేట్ ఏంటంటే.. దువ్వాడ‌తో సంబంధం పెట్టుకుందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పలాస జాతీయ రహదారిపై దివ్వెల మాధురి రోడ్ యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిందే. యాక్సిడెంట్‌లో ఆమె కారు నుజ్జు నుజ్జు అయ్యింది. తను కావాలనే ఆత్మహత్య యత్నంలో భాగంగా యాక్సిడెంట్ చేశానని మాధురి చెబుతున్నారు. నెగ్లిజన్స్‌తో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించే చట్టం ప్రకారం ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. నూతన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 125 ప్రకారం కేసు నమోదైంది.


శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చెలరేగిన వివాదానికి దివ్వెల మాధురి కేంద్ర బిందువుగా మారారు. గత కొంతకాలంగా దువ్వాడతో మాధురి కలిసి ఉంటున్నారని ఆయన భార్యాకూతుళ్లు ఆందోళన చేస్తున్నారు. బీభత్సంగా దువ్వాడ, మాధురి, దువ్వాడ సతీమణి వాణిల నడుమ పెద్ద ఎత్తున వార్ నడుస్తోంది. మాధురిపై వాణి ఆమె పిల్లలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వార్ ఇలా కొనసాగుతుండగానే.. మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. టెక్కలి నుంచి పలాస వెళ్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును ఆమె కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధురికి గాయాలవడంతో ముందుగా పలాస ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే తనకు ప్రమాదం జరగడానికి కూడా కారణం వాణియే అని మాధురి ఆరోపిస్తున్నారు. ఆమె బాధ పడలేకే ఇలా ఆత్మహత్యాయత్నం చేశానని చెబుతున్నారు.


తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనతో పాటు తన పిల్లలపై ట్రోల్స్‌ను తట్టుకోలేకపోతున్నానని అందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని దివ్వెల మాధురి చెప్పారు. హాస్పిటల్‌కు తరలించగా.. బెడ్‌పై పడుకొని ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే పోలీసులపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. ఇది రోడ్డుప్రమాదం కాదని.. తానే కారును ఢీకొట్టానని వెల్లడించారు. దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహారంలో వాణి ఆరోపణలను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపారు. వైద్యులు నాకు చికిత్స అందించవద్దని మాధురి కోరారు. బ్రీత్‌ అనలైజేషన్‌ టెస్ట్‌తో పాటు బ్లడ్‌ శాంపిల్‌ తీయడంపై మాధురి అభ్యంతరం వ్యక్తం చేశారు. విలేకరుల సమక్షంలో ఆ టెస్ట్‌లన్నీ చేయాలని కోరినా పోలీసులు అనుమతించలేదని ఆరోపించారు. ఇదంతా రాజకీయ కుట్రగా మాధురి అభివర్ణించారు. దీనిలో రాజకీయ కోణానికి తావు లేదని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి దువ్వాడ ఫ్యామిలీ డ్రామాకు ఇప్పట్లో బ్రేకులు పడేలా కనిపించడం లేదు.

Updated Date - Aug 12 , 2024 | 11:41 AM