Share News

AP News: విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై ఢిల్లీలో కీలక చర్చలు..

ABN , Publish Date - Oct 22 , 2024 | 02:21 PM

ఢిల్లీ పర్యనటలో భాగంగా ఇవాళ (మంగళవారం) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులను కేంద్ర మంత్రి దృష్టికి నారాయణ తీసుకెళ్లారు.

AP News: విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై ఢిల్లీలో కీలక చర్చలు..

అమరావతి: ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ, సత్యకుమార్ యాదవ్ మూడ్రోజులుగా బిజీబిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులు సహా ఆయా శాఖల ఉన్నతాధికారులతో భేటీ అవుతున్నారు. ఏపీకి రావాల్సిన నిధులపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్ ద్వారా కేంద్రం అందివ్వనున్న రూ.15వేల కోట్లపై చర్చలు సాగుతున్నాయి. అలాగే సోమవారం నాడు హడ్కో అధికారులతో ఏపీ పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణానికి రుణంతోపాటు ఏపీ మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపుపై మంత్రి చర్చించారు.


ఢిల్లీ పర్యనటలో భాగంగా ఇవాళ (మంగళవారం) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులను కేంద్ర మంత్రి దృష్టికి నారాయణ తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టులపై ఇరువురూ కీలకంగా చర్చించారు. మెట్రో ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలని కేంద్ర మంత్రిని నారాయణ కోరారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వీటిని ప్రతిపాదించామని, రెండు ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మనోహర్‌కు విజ్ఞప్తి చేశారు.


విజయవాడ మెట్రోను రాజధాని అమరావతికి అనుసంధానించే ప్రతిపాదనలూ ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఖట్టర్ దృష్టికి నారాయణ తీసుకెళ్లారు. అమృత్-2 పథకం ఐదేళ్లుగా రాష్ట్రంలో అమలుకు నోచుకోలేదని చెప్పారు. దీంతో ఆ పథకం అమలుకు ఉన్న మార్గాలపై ఇరువురు చర్చించారు. మెట్రో ప్రాజెక్టుల విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హామీ ఇచ్చారు.

Updated Date - Oct 22 , 2024 | 02:21 PM