Share News

Princess Indira Devi Dhanrajgir : ఆ రోజుల్లో...

ABN , Publish Date - Jun 23 , 2024 | 01:08 AM

ఒకప్పుడు మన దేశంలో ముఖ్యమంత్రులకు చాలా గౌరవం ఉండేది. వారి సిఫార్సులను విదేశాలలో కూడా గౌరవంగా చూసేవారు. ఇక ప్రధానులకు సాహితీకారులంటే విపరీతమైన గౌరవం ఉండేది.

Princess Indira Devi Dhanrajgir :  ఆ రోజుల్లో...

ఒకప్పుడు మన దేశంలో ముఖ్యమంత్రులకు చాలా గౌరవం ఉండేది. వారి సిఫార్సులను విదేశాలలో కూడా గౌరవంగా చూసేవారు. ఇక ప్రధానులకు సాహితీకారులంటే విపరీతమైన గౌరవం ఉండేది. ఒక దేశ ప్రధాని- ఒక విదేశీభాషకు సంబంధించిన లైబ్రరీ శంకుస్థాపన కార్యక్రమానికి రావటం ఇప్పుడు సాధ్యమవుతుందా? ఒకప్పుడు అది కూడా సాధ్యమే! నేటి పరిస్థితులను.. రాజకీయనాయకులను గమనిస్తుంటే- నాకు మారిషస్‌లో నా తొలి విదేశీ పర్యటన గుర్తుకువచ్చింది.

నాకు 26 ఏళ్లు ఉన్నప్పుడు నా తొలి విదేశీ పర్యటనకు వెళ్లా! అది కూడా తెలుగు రచయిత బృందానికి నాయకురాలిగా. మారిషస్‌లో తెలుగు వారి కోసం ఒక లైబ్రరీ నిర్మించాలనుకున్నారు. ఈ లైబ్రరీ శంకుస్థాపనా కార్యక్రమానికి తెలుగువారికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక బృందాన్ని పంపాలనుకున్నారు. నా పేరు ఎవరు ప్రతిపాదించారో తెలియదు కానీ.. శేషేంద్ర, పోతుకూచి సాంబశివరావు, నేను ఒక బృందంగా మారిషస్‌కు బయలుదేరాం. నాకు అక్కడ ఎవరు ఉంటారో తెలియదు. అక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. ఎందుకైనా మంచిదని అప్పటి ముఖ్యమంత్రి బ్రహానంద రెడ్డిని ఒక ఉత్తరం ఇవ్వమని అడిగాను. ఆయన అక్కడి ప్రధానికి నన్ను పరిచయం చేస్తూ ఒక ఉత్తరం ఇచ్చారు. విమాన ప్రయాణం బాగా జరిగింది. మారిషస్‌ రాజధానికి చేరుకున్నాం. అక్కడ ప్రభుత్వం తరుపున ఆతిధ్యం ఇచ్చేవారు- నాకు ఒక చోట వసతి ఏర్పాటు చేశారు. శేషేంద్ర, ఇతరులకు వేరే చోట విడిది ఇచ్చారు. అందమైన పూలతోట.. సమీపంలోనే నదీతీరం.. నాకు వసతి ఏర్పాటు చేసిన ప్రాంతం స్వర్గంలా అనిపించింది.


ఉదయాన్నే లేచి బ్రేక్‌ఫాస్ట్‌ చేసి రిలాక్స్‌ అవుతున్న సమయంలో- ప్రధాని మంత్రి సీవూసగర్‌ అపాయింట్‌మెంట్‌ ఒక గంటలో ఉందనే కబురు వచ్చింది. వెంటనే మేము తయారయి ప్రధాని కార్యాలయానికి వెళ్లాం. అక్కడికి వెళ్లిన వెంటనే- ప్రధాని సెక్రటరీ డాక్టర్‌ హజారేసింగ్‌ మమల్ని రిసీవ్‌ చేసుకున్నారు. పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత ప్రధాని కార్యాలయంలోకి మమల్ని తీసుకువెళ్లారు. ప్రధాని మాకు స్వాగతం చెప్పారు. ఆయనకు బ్రహ్మనందరెడ్డి రాసిన ఉత్తరాన్ని, కొన్ని పుస్తకాలను ఇచ్చాను. ఆ తర్వాత మేము లైబ్రరీకి శంకుస్థాపన చేస్తున్నామని చెప్పాం. మా ఆలోచనలు ఆయనతో పంచుకున్నాం. శంకుస్థాపన కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించాం. ఒక దేశ ప్రధానిని- శంకుస్థాపన కార్యక్రమానికి రమ్మని అడగటమే ఒక సాహసం. అది కూడా ఎటువంటి ముందస్తు అపాయింట్‌మెంట్‌ లేకుండా. నాకు ఆయన వస్తాడనే నమ్మకం ఏ కోశాన లేదు. కానీ వెంటనే ఆయన తన ప్రైవేట్‌ సెక్రటరీని పిలిచి- ఆ రోజు అపాయింట్‌మెంట్స్‌ ఏమిటో తెలుసుకున్నారు. అన్నింటినీ క్యాన్సిల్‌ చేయమని మా కార్యక్రమానికి వస్తానన్నారు. ఇప్పటికీ ఆ సంఘటన గురించి ఆలోచిస్తూ ఉంటే- అది నిజమా? కలా? అనే విషయం అర్థం కాదు. ఒక దేశ ప్రధాని దగ్గరకు ఎటువంటి అపాయింట్‌మెంట్‌ లేకుండా వెళ్లి- ఆయనను ఒక ప్రైవేట్‌ ఫంక్షన్‌కు పిలవటం ఇప్పుడు ఏ విధంగాను సాధ్యం కాదు. ఆ సమయంలో సాహిత్యకారుల పట్ల.. కళాకారుల పట్ల నాయకులకు అంత గౌరవం ఉండేది.


ఆ రోజు కార్యక్రమానికి ప్రధానితో పాటుగా ఆ దేశంలోని అనేక మంది కళాకారులు, సాహితీకారులు, భాషాభిమానులు హాజరయ్యారు. అంత మంది ముందు నేను ఒక ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చింది. ఒకప్పుడు మారిషస్‌లో ఎక్కువగా ఫ్రెంచ్‌ మాట్లాడేవారు. ఇంగ్లీషు తక్కువగా మాట్లాడేవారు. నాకు ఫ్రెంచ్‌ మాట్లాడటం అస్సలు రాదు. పైగా అంత మంది పెద్దల ముందు నా తొలి ప్రసంగం! నా పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో అర్థం చేసుకోండి. మొత్తానికి నా ప్రసంగం బాగానే సాగింది. అందరూ ఆసక్తిగా విన్నారు. ఆ మర్నాడు నన్ను అనేక మంది సాహితీకారులకు పరిచయం చేశారు. ఈ పర్యటనలో నాకు బాగా గుర్తున్న మరొక సంఘటన- ప్రముఖ కవి మార్సల్‌ కాబాన్‌, ఆయన భార్య మేడమ్‌ డి కెవిరన్‌లను కలవటం. ఒక అందమైన చిన్న కొండ మీద ఉన్న వారి ఇంటికి హజారేసింగ్‌ నన్ను తీసుకువెళ్లారు. అక్కడ కెవిరన్‌ మాకు ఆతిధ్యం ఇవ్వటంతో పాటుగా ‘అప్సర’ అనే ఫ్రెంచ్‌ దీర్ఘకవితను వినిపించారు. ఇప్పటికీ ఆమె మృదువైన కంఠం, చదివే విధానం అన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.

రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌

Updated Date - Jun 23 , 2024 | 01:13 AM