Share News

నల్లగొండ జిల్లా కేతేపల్లి వద్ద డివైడర్‌ను ఢీకొట్టిన కారు

ABN , Publish Date - Aug 30 , 2024 | 03:15 AM

కారు డ్రైవర్‌ నిద్రమత్తు ఒకరి ప్రాణం తీసింది. మరో ఇద్దర్ని తీవ్ర గాయాలపాల్జేసింది. పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం..

నల్లగొండ జిల్లా కేతేపల్లి వద్ద డివైడర్‌ను ఢీకొట్టిన కారు

  • ఒకరి మృతి.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు

  • ప్రాణం తీసిన నిద్రమత్తు

కారు డ్రైవర్‌ నిద్రమత్తు ఒకరి ప్రాణం తీసింది. మరో ఇద్దర్ని తీవ్ర గాయాలపాల్జేసింది. పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ మియాపూర్‌కు చెందిన సొంటి కృష్ణ సంతోష్‌ విజయవాడలో తన మేనత్త అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తల్లిదండ్రులు దుర్గామల్లేశ్‌ ప్రసాద్‌, శివనాగమల్లేశ్వరి(63), మేనత్తలు పామర్తి పార్వతి, గుడిపల్లి అలివేలమ్మలతో కలిసి గురువారం తెల్లవారుజామున 3గంటలకు కారులో బయలుదేరారు.

కారు ఉదయం ఆరు గంటలకు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రం వద్ద ప్రమాదానికి గురైంది. కారు నడుపుతున్న సొంటి కృష్ణను నిద్రమత్తు ఆవరించడంతో కారు అదుపు తప్పి.. కేతేపల్లి డీపౌల్‌ స్కూల్‌ వద్ద గల జంక్షన్‌లోకి దూసుకెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీకొట్టింది. ప్రమాదధాటికి కారు ముందు ఎడమ చక్రం విరిగి దూరంగా పడింది. కారులోని ఎయిర్‌ బ్యాగులు తెరుచుకోవడంతో ముందు సీట్లలో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు వెను సీటులో కూర్చున వారిలో సొంటి కృష్ణ సంతోష్‌ తల్లి శివనాగమల్లేశ్వరి ప్రమాద తీవ్రతకు భయాందోళనకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంలో గాయపడిన దుర్గామల్లేశ్‌ ప్రసాద్‌, పామర్తి పార్వతి, గుడిపల్లి అలివేలమ్మను చికిత్స నిమిత్తం తొలుత నకిరేకల్‌ ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

Updated Date - Aug 30 , 2024 | 03:16 AM